ప్రధానమంత్రి నరేంద్రమోడిని మోసగాడని, ఏపిని మోసం చేశారని ఆరోపిస్తున్న చంద్రబాబునాయుడు తానేంటో మాత్రం చెప్పటం లేదు. జనాలను మోడి ఏ విధంగా వంచించారో అదే పద్దతిలో తాను కూడా మోసం చేసిన విషయం మరచిపోయినట్లున్నారు. పోయిన ఎన్నికల్లో మోడి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురు కలిసే జనాలకు హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు కలిసే మోసం చేశారు. మొదటి ఇద్దరు అధికారంలో ఉన్నారు కాబట్టే ఒకళ్ళని మరొకరు మోసం చేసుకున్నారు. మొత్తం మీద తేలిందేమిటంటే, అంతా కలిసి జనాలను మోసం చేశారని.
మోడి చేసిన మొసమేంటి ?
మోడి ఏ విధంగా మోసం చేసారట ? ప్రత్యేకహోదా ఇస్తామని, ప్రత్యేక రైల్వేజోన్ మంజూరు చేస్తామని, విభజన చట్టాన్ని అమలు చేస్తామని ఎన్నికల సమయంలో జనాలకు హామీ ఇచ్చి మాట తప్పారట. ప్రధానమంత్రి అయిన తర్వాత పెద్ద నోట్లైన 2 వేలు, 500 రూపాయల నోట్లను రద్దు చేయటం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీశారని చంద్రబాబు ఇపుడు ఆరోపిస్తున్నారు. నోట్ల రద్దు విషయంలో తాను చేసిన సూచనలను మోడి పాటించలేదని మండిపడుతున్నారు.
చంద్రబాబు చేతకాని తనమే
విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదన్న మాట వాస్తవమే. అయితే, హామీలు అమలయ్యేట్లు కేంద్రంపై ఒత్తిడి తేవటంలో చంద్రబాబు కూడా విఫలమయ్యారు. ఓటుకునోటు కేసులో ఇరుక్కోవటంతో కేంద్రం ఆడించినట్లు ఆడారు. అందుకే ప్రత్యేకహోదాపై అన్ని సార్లు పిల్లిమొగ్గలేశారు. చంద్రబాబు చేతకానితనం వల్లే కేంద్రానికి ఏపి ప్రయోజనాలంటే అలుసైపోయింది. ఇక, నోట్ల రద్దు విషయం చూస్తే పెద్ద నోట్లను రద్దు చేయమని చెప్పింది తానేనంటూ అప్పట్లో చంద్రబాబే స్వయంగా డప్పు కొట్టుకున్నారు. ప్రయోగం వికటించేసరికి నోట్ల రద్దు సలహా తానివ్వలేదని తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇచ్చిన హామీలను మరచిపోయిన చంద్రబాబు
అదే విధంగా పోయిన ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్ని హామీలిచ్చింది అందరూ చూసిందే. అందులో ఎన్నింటిని సంపూర్ణంగా నెరవేర్చారు. రైతు, డ్వాక్రా, చేనేతలకు రుణమాఫీ, కాపులను బిసిల్లో చేర్చటం, బోయలను ఎస్టీల్లో చేర్చటం, నిరుద్యోగ భృతి ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు కాలేదు. ఇచ్చిన హామీలపై నిలదీస్తే ఏమవుతుందో మొన్న ముస్లింలపై పెట్టిన దేశద్రోహం కేసులే ఉదాహరణ. ఇక, తన వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమని చెప్పుకున్నారు కదా ? మరి కట్టారా ?
రాష్ట్రాన్నే కుదవపెట్టేస్తున్నారు
రాష్ట్ర విభజన సమయం కన్నా ఇపుడు రాష్ట్రం ఆర్దికంగా మరింత దిగజారిపోయింది. మొత్తం మీద ఏపిని అప్పులకుప్పగా మార్చటమే కాకుండా పరాయి పాలకులకు కుదవపెట్టేస్తున్న విషయం స్పష్టమవుతోంది. కాబట్టి ఏపిని నరేంద్రమోడి మోసం చేశారని ఆరోపించే ముందు తానేం చేశారో గుర్తు చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మీడియా బలముంది కాబట్టి తన మోసాలు బయటకు రాకుండా మ్యానేజ్ చేసుకోగలుగుతున్నారంతే.