సభను సక్సెస్ చేయడం అంటే ట్విట్టర్లో ట్వీట్ చేసినంత ఈజీ కాదు.. ఇదీ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత వ్యాఖ్య. ఎందుకీ వ్యాఖ్య చేశారు..? ఎవరిని ఉద్దేశించి అన్నారు..? ఈ ప్రశ్నలను ఎవరిని అడిగినా టక్కున సమాధానం వస్తుంది.. ఎందుకంటే.. టీఆర్ఎస్ పార్టీలో ట్వీట్ల మంత్రిగా గుర్తింపు పొందింది ఎవరో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొంగరకలాన్లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ అట్టర్ ప్లాప్ కావడానికి ఆయనే కారణమనే వాదన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కొంగరకలాన్ సభ ఫెయిల్యూర్ ఆ మంత్రి మెడకు చుట్టుకుంటోంది. ఇంతకీ ఆ ట్వీట్ల మంత్రి మరెవరో కాదు సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆరే. మంత్రి హరీశ్రావును పక్కన బెట్టి మంత్రి కేటీఆర్కు ప్రగతి నివేదన సభ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు కేసీఆర్. తీరా.. సభ నిర్వహణ తీరుపై తీవ్ర స్థాయిలో సొంత పార్టీవర్గాల నుంచి అసంత`ప్తి, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో అందరూ కేటీఆర్వైపు వేలెత్తి చూపుతున్నారు.
నిజానికి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడుతారంటే ఇదేనేమో..! చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 25లక్షల మందితో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తామని హైప్ క్రియేట్ చేయడమే వ్యూహాత్మక తప్పిదమని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చేసే పనిలో విషయం లేనప్పుడే ఇలాంటి హైప్ క్రియేట్ చేస్తారని అంటున్నారు. తీరా.. సభకు ఐదారు లక్షల మందికంటే ఎక్కువ రాకపోవడం..కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం.. నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం.. విపరీతంగా డబ్బు, మద్యం పంపకాలతో చిల్లర సభగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రధానంగా సీఎం కేసీఆర్ ప్రసంగం చాలా చప్పగా సాగడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతలే లోలోపల విమర్శలు గుప్పిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికంతటికీ కారణం మంత్రి కేటీఆరేనని, ఆయన సభా నిర్వహణ బాధ్యతలు అప్పగించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పెద్దపొరపాటనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
నిజానికి.. ఇలాంటి సభలను విజయవంతం చేయడంలో మంత్రి హరీశ్రావు దిట్ట. ఓడిపోయే స్థానాల్లోనూ పార్టీని ఒంటిచేత్తే గెలిపించగలరనే గుర్తింపును సొంతం చేసుకున్నారు ఆయన. అంతేగాకుండా.. ట్విట్టర్కు దూరంగా ఎప్పుడూ క్షేత్రస్థాయిలో ఉండే మంత్రి హరీశ్ జనం నాడి బాగా తెలుసుననీ.. జన సమీకరణ ఎలా చేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని పలువురు నాయకులు అంటున్నారు. ఇదే విషయం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు రుజువు కూడా అయింది.
ఇంతటి అనుభవం ఉన్న నేతను కాదని కేటీఆర్కు బాధ్యతలు అప్పగించడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర అసంత`ప్తి వ్యక్తమవుతోంది. మంత్రి హరీశ్కు బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి మరోలా ఉండేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా మంత్రి హరీశ్ ఆక్టివ్గా ఉండడం లేదని, సొంత పత్రికలోనూ ఆయన పెద్దగా కనిపించడం లేదని పలువురు నాయకులు అంటున్నారు. గులాబీ గూటిలో నెలకొన్న కొంగరకలాన్ కంగారు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి మరి.