వచ్చే ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం చంద్రబాబునాయుడు రెండంచెల వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లే కనబడుతోంది. పోయిన ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున పోటి చేసిన ముస్లిం అభ్యర్ధుల్లో ఒక్కరు కూడా గెలవలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ముస్లింలకు వచ్చిన 4 శాతం రిజర్వేషన్ కావచ్చు ఇంకేదైనా లబ్ది కావచ్చు మొత్తం మీద వైసిపిని ముస్లిం మైనారిటీలు బాగా ఆధరించారు. దానికితోడు తెలుగుదేశంపార్టీ, బిజెపిలు పొత్తులు పెట్టుకోవటాన్ని కూడా ముస్లింలు వ్యతిరేకించిన విషయం అర్ధమవుతోంది.
ముస్లిం ఓట్ల కోసం డ్రామాలు
నాలుగేళ్ళు బిజెపితో అంటకాగిన కాలంలో చంద్రబాబుకు మైనారిటీలు గుర్తుకురాలేదు. ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కొత్త ఓటు బ్యాంకును వెతుక్కునే పనిలో చంద్రబాబు వ్యూహాలకు పదునుపెట్టారు. అందులో భాగంగానే ముస్లింలను ఆకట్టుకునేందుకు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. ఎప్పుడైతే బిజెపితో తెగ తెంపులు చేసుకున్నారో అప్పటి నుండి ముస్లింలను ఆదరించేది ఒక్క టిడిపి మాత్రమే అనే కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. మొన్నటి నారా హమారా-టిడిపి హమారా సభ కూడా అందులో ఒకటి.
వైసిపిని దెబ్బ కొట్టటమే లక్ష్యం
సరే, కొత్త ఓటు బ్యాంకును సంపాదించుకోవటంలో తప్పేమీ లేదు. కానీ అదే సమయంలో ముస్లింలను వైసిపికి దూరం చేయాలని అనుకున్నారు. సాధ్యం కాకపోవటంతో కొత్త ప్రణాళిక అమలు చేస్తున్నట్లే అనుమానంగా ఉంది. అదేమిటంటే, ముస్లిం ఓట్లను ఏరిపారేయటం. పోయిన ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో అయితే వైసిపిని ముస్లింలు ఆదరించారో, ఎక్కువగా ఓట్లు వేశారో అక్కడంతా చంద్రబాబు దృష్టి సారించారు. కడప, నంద్యాల, కర్నూలు, గుంటూరు, మంగళగిరి, ప్రొద్దుటూరు, విజయవాడ, కదిరి లాంటి నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో వేలాది ముస్లిం ఓట్లు గల్లంతయ్యాయి. అంటే వచ్చే ఎన్నికల్లో తమకు పడవు అనే అనుమానం ఉన్న ఓట్లను ఏరేస్తున్నారు. తమకు పడకపోయినా పర్వాలేదు కానీ వైసిపికి మాత్రం దక్కకూడదన్నదే అసలు వ్యూహంగా అనిపిస్తోంది. మరి, ఈ వ్యూహాన్ని వైసిపి ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిందే.