మాజీ డిజిపి సాంబశివరావు ఏదో వ్యూహంతోనే ముందుకెళుతున్నట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే, పార్టీల అధినేతలతో ఆయన సమావేశాలు జరుపుతున్న తీరు వల్లే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో మాజీ డిజిపి భేటీతో అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయ్. భేటీ మామూలే అని చెబుతున్నా ఎవరూ నమ్మటం లేదు.
వైసిపిని రాచి రంపాన పెట్టిన మాజీ డిజిపి
డిజిపిగా ఉన్నంత కాలం అధికారపార్టీ చెప్పుచేతుల్లో మసిలారు. ఎవరు డిజిపిగా ఉన్నా జరిగేదదే అనుకోండి అది వేరే సంగతి. కానీ సాంబశివరావు మాత్రం కొంచెం ఓవర్ యాక్షన్ చేశారనే చెప్పాలి. వైసిపితో తనకేదో వ్యక్తిగత కక్ష ఉన్నట్లు రాచిరంపాన పెట్టారు. దాంతో వైసిపి నేతలు కూడా సాంబశివరావుపై ఎన్నో ఆరోపణలతో విరుచుపడింది. ఉద్యోగ విరమణ తర్వాత మాజీ డిజిపిని గంగవరం పోర్టు ఛైర్మన్ గా చంద్రబాబు నియమించారు.
గంటాతో భేటీ దేనికి సంకేతం ?
ఈమధ్య హటాత్తుగా విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ ను సాంబశివరావు కలవటం సంచలనమైంది. రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎంఎల్ఏ లేదా ఎంపిగా వైసిపి తరపున పోటీ చేయబోతున్నారంటూ ఒకటే ప్రచారం జరిగింది. దాంతో టిడిపి నేతలు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. వెంటనే చంద్రబాబుతో భేటీకి ఏర్పాటు చేశారు. జగన్ తో ఏం మాట్లాడారో తెలీదు, చంద్రబాబుతో ఏం మాట్లాడింది తెలియలేదు. తాజాగా గంటాతో భేటీ అవటం సర్వత్రా ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఎందుకంటే, గంటా ఈరోజు, రేపో టిడిపిని వదిలేసి జనసేనలో చేరుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎలాగూ జనసేన కాపుల కోసమే పెట్టిన పార్టీగా ప్రచారంలో ఉంది. జనసేన అధినేత, గంటా, సాంబశివరావు అందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావటంతోనే గంటా-మాజీ డిజిపి భేటీపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.