చంద్రబాబునాయుడు ఆలోచనలన్నీ ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. మంచి జరిగితే తన ఖాతాలో ఎదురుదెబ్బ తగులుతందనుకుంటే ఎదుటి వారి ఖాతాలో వేసేస్తారు. ఈ అలవాటు మొదటి నుండి ఉన్నదే. నోట్ల రద్దు కావచ్చు, ప్రత్యేకహోదాపై ఆందోళనలు కావచ్చు, ముస్లింల విషయంలో కూడా కావచ్చు.
పెరిగిపోతున్న ఆయిల్ ధరలు
ఇపుడీ విషయం ఎందుకంటే, దేశంలోని అన్నీ ప్రాంతాల్లోనూ పెట్రోలు, డీజల్ ధరలు బాగా పెరిగిపోయిన విషయం అందరూ చూస్తున్నదే. దాంతో దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వంపై జనాలు మండిపోతున్నారు. జనాల మూడ్ గమనించిన చంద్రబాబు తను కూడా కేంద్రంపై దుమ్మెత్తి పోయటం మొదలుపెట్టారు. పెంచిన ఆయిల్ ధరలను వెంటనే కేంద్రం తగ్గించాలంటూ డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.
అదనపు పన్నులు ఎత్తేయొచ్చుగా ?
పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోతున్నాయనటంలో సందేహం లేదు. పెరుగుతున్న ధరలకు కేంద్రం అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలతో ముడిపెడుతోంది. క్రూడయిల్ ధరలు పెరుగుతోంది కాబట్టి మనదేశంలో ఆయిల్ ధరలు పెరుగుతోందని చెబుతున్న కేంద్రం, క్రూడాయిల్ ధరలు తగ్గినపుడు మాత్రం అదే దామాషాలో తగ్గించటం లేదు. మనకు ఆయిల్ ధరలు పెరిగిపోవటానికి కేంద్రం వైఖరి ఒక కారణమైతే చంద్రబాబు చేతివాటం కూడా కారణమే. చాలా రాష్ట్రాల్లో లేనంతగా ఏపిలో ఆయిల్ పై అదనపు పన్నులను చంద్రబాబు వసూలు చేస్తున్నారు. దాని వల్ల తమిళనాడు, కర్నాటక కన్నా ఏపిలో ఆయిల్ ధరలు చాలా ఎక్కువగా ఉంటోంది. కేంద్రాన్ని ధరలు తగ్గించమని అడిగే ముందు తాను అదనపు బాదుడు ఎత్తేయొచ్చు కదా ? ఈ అదనపు బాదుడు సంగతి తెలీకుండా జనాల్లో చాలామంది కేంద్రాన్ని తిట్టుకుంటున్నారు.