గత కొంత కాలంగా దేశంలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతున్నారు. ఆ మద్య భారీ స్థాయిలో డ్రస్ రాకెట్ గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్, రాజకీయ నాయకులతో పాటు విద్యార్థులకు కూడా ప్రమేయం ఉందని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటీనటులను సిట్ విచారణ కూడా చేసింది. తాజాగా హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.
ఓ ఆఫ్రికన్ ను అరెస్టు చేసి, అతడి నుంచి రూ.1.5 లక్షలు విలువైన 15 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, జిల్లా ఎన్పోర్స్మెంట్ ఏఈఎస్ నంద్యాల అంజిరెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. ఆఫ్రికాకు చెందిన విండ్ గుస్సన్(30), నైజీరియాకు చెందిన ఈవ్స్ అలియాస్ హమ్జా, ఒబమ్ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా నాయకుడైన హమ్జా చదువు కోవడానికి భారత్కు వచ్చే ఆఫ్రికా, నైజీరియా దేశాలకు చెందిన పేద విద్యార్థులతో డ్రగ్స్ వ్యాపారం చేయిస్తున్నాడు.
హమ్జా నుంచి ఒబమ్ డ్రగ్స్ తీసుకొచ్చి విండ్ గుస్సన్కు ఇస్తుండగా, అతడు వాటిని హైదరాబాద్లోని పలువురు వినియోగదారులకు అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం బైబుల్హౌస్ నుంచి లోయర్ ట్యాంక్బండ్ గోషాలవరకు రూట్వాచ్ నిర్వహించి, తనిఖీలు చేశారు. విండ్ గుస్సన్ వద్ద 15 గ్రాముల కొకైన్ లభించింది. విచారణలో డ్రగ్స్ రాకెట్ గుట్టు బయటపడింది.