అదృష్టం ఎప్పుడోగానీ తలుపుతట్టదంటారు. అటువంటి అవకాశం ఇపుడు తండ్రీ, కొడుకులు చంద్రబాబునాయుడు, లోకేష్ లకు ఒకేసారి తలుపు తడుతున్నట్లుంది. దేశంలోనే అరుదైన రికార్డు సృష్టించే అవకాశం వస్తోంది. తెలంగాణా ముందస్తు ఎన్నికల రూపంలో వచ్చే అదృష్టాన్ని తండ్రి, కొడుకులు ఉపయోగించుకుంటే దేశమంతా వారి పేరు మారు మోగిపోవటం ఖాయం. ఇంతకీ ఆ అదృష్టం ఏమిటనే కదా ఆలోచిస్తున్నారు. అదేమిటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ముందస్తు ఎన్నికల సంకేతాలు
తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు తప్పదనే సంకేతాలు కనబడుతున్నాయి కదా ? ఎటు తిరిగి తెలుగుదేశంపార్టీ జాతీయ పార్టీనే కదా ? మరి ఏపిలో మంత్రి, టిడిపికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా ? ఎందుకంటే, తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ స్ధానాలకు పోటీ చేస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. పైగా ఏ పార్టీతోను పొత్తుండదని కూడా స్పష్టంగా చెప్పారు. అదేదో తానే ముందుండి నడిపిస్తే బాగుంటుంది కదా ?
చెల్లా చెదురైపోయిన నేతలు
తెలంగాణా విషయానికి వస్తే టిడిపికి నిజంగా దారి తెన్ను లేదన్నది వాస్తవం. స్వయంగా చంద్రబాబే తెలంగాణాలో పార్టీని గాలికి వదిలేశారన్నది వాస్తవం. అందులోనూ తెలుగుదేశంపార్టీలోని గట్టి నేతల్లో చాలా మంది చెల్లా చెదురైపోయారు. అధికార టిఆర్ఎస్ లోకి కొందరు వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళల్లో మరికొందరు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇపుడు పార్టీలో మిగిలింది అడుగు బొడుగే. అటువంటి నేతలను పట్టుకుని లోకేష్ ఎన్నికల గోదావరిని ఈదాలని అనుకుంటున్నారు.
లీడర్ లేని క్యాడర్
తెలంగాణాలో టిడిపి పరిస్దితి తెలిసి కూడా అటువంటి ప్రకటన ఇచ్చారంటేనే లోకేష్ తెలివి తేటలేంటో అర్ధమైపోతోంది. నిజంగానే పార్టీ ఒంటిరిగా పోటీ చేయాలంటే గట్టి అభ్యర్ధులు దొరుకుతారా అన్నది సందేహమే. ఎందుకంటే, పార్టీకి ఇపుడు తెలంగాణాలో మిగిలింది క్యాడర్ మాత్రమే. క్యాడర్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో నెగ్గటం లోకేష్ చెప్పినంత సులభం కాదు. లీడర్ లేని క్యాడర్ చుక్కాని లేని నావలాంటిదన్న విషయం లోకేష్ కు తెలీదు.
తెలంగాణాలో లోకేష్ పోటీ చేయాలి
కాబట్టి లోకేష్ ఇపుడొక పనిచేస్తే తన సామర్ధ్యం ఏంటో లోకానికి చాటి చెప్పినట్లుంటుంది. ఏపిలో మంత్రిగా రాజీనామా ఇచ్చేసి తెలంగాణాలో ఏదో ఒక స్ధానం నుండి అసెంబ్లీకి పోటీ చేయాలి. అప్పుడు నేతల్లోను, క్యాడర్లోను కొత్త ఉత్సాహం వస్తుంది. అదే సమయంలో పార్టీని లోకేష్ గనుక ఎన్నికల్లో గెలిపించగలిగితే తండ్రి, కొడుకులు ఏపి, తెలంగాణా కు ఏకకాలంలో ముఖ్యమంత్రులుగా ఏలవచ్చు. అప్పుడది దేశంలోనే అరుదైన రికార్డవుతుంది. ఏకకాలంలో రెండు రాష్ట్రాలకు తండ్రి, కొడుకులు ముఖ్యమంత్రులుగా ఇప్పటి వరకూ లేరనే అనుకోవాలి. చంద్రబాబు తరచూ చెబుతున్నట్లు ప్రపంచంలోనే నారా కుటుంబం రికార్డు సృష్టిస్తుందేమో ?