తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పెద్ద జోకు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ఓడించటమే తెలుగుదేశంపార్టీ లక్ష్యమని రమేష్ అంటున్నారు. బిజెపి ఓడిపోతేనే ఏపికి మేలు జరుగుతుందట. అందుకనే బిజెపి వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేస్తున్నట్లు రమేష్ తెలిపారు. తెలంగాణాలో ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలో చంద్రబాబు నిర్ణయిస్తారని కూడా చెప్పారు.
బిజెపికున్న బలమెంత ?
ఇక్కడ సిఎం రమేష్ ఒక విషయం మరచిపోయినట్లున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి ఉన్నంత బలమెంత ? ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కలిపి బిజెపికి ఉన్న ఎంపిల సంఖ్య మూడు. ఏపిలో ఇద్దరు గెలవగా తెలంగాణాలో ఒకరు గెలిచారు. పోయిన ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపికి అన్యాయం చేసిందన్నది వాస్తవం. అయితే, ఏపికి జరిగిన అన్యాయంలో బిజెపికే కాదు చంద్రబాబుకు కూడా పాత్రుంది.
రమేష్ భీషణ ప్రతిజ్ఞ
సమైక్య రాష్ట్రంలో బిజెపి ఎప్పుడు కూడా బలమైన పార్టీ కానేకాదు. ఇపుడు ఏపికి చేసిన అన్యాయం వల్ల వచ్చే ఎన్నికల్లో ఇపుడున్న ఇద్దరు ఎంపిలు, నలుగురు ఎంఎల్ఏలు మళ్ళీ గెలుస్తారన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లోనే లేదు. బిజెపి పరిస్దితి అలాగుంటే రమేష్ ఏమో బిజెపిని ఓడించటమే లక్ష్యమని భీషణ ప్రతిజ్ఞ చేయటమే పెద్ద జోక్. అప్పటికేదో ఏపిలో బిజెపి ఎంపి సీట్లు గెలవటంపైనే కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చే విషయం ఆధారపడ్డట్లు చెబుతున్నారు. ఏడాది పాటు బాగా కసరత్తులు చేసి చివరకు మూలనున్న ముసలయ్యను కొట్టినట్లుంది సిఎం రమేష్ మాటలు.