ఇప్పుడు తెలంగాణా జనంలో బలంగా వినిపించేది "ప్రగతి నివేదన సభ" పేరుతో అంత ధారుణ దుబారా ఖర్చు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మితిమీరిన అధికార దుర్వినియోగం సుస్పష్టంగా బట్టబయలైంది. ఉదాహరణగా ఆ కార్యక్రమంలో మొహరించిన పోలీసు వ్యవస్థ - బస్- స్టాండ్స్ లో నుండి ప్రయాణీకుల సౌకర్యాలను సైతం ఆపేసి, బస్ లను ప్ర.ని.స. దారి మళ్ళించిన అవసమేమివచ్చింది.
టిఆరెస్ అంత బలహీనంగా ఉందా? ఇది ముఖ్యంగా గ్రామీణులు, పట్టణ మద్య తరగతి ప్రజల ఆలోచన. అన్నింటినీ మించి గతంలో అధికార అహంకారం, పదవీ బలంతో కొనసాగించిన దుష్కార్యాలు - నేడు ముందస్తు ఎన్నికల్లో ఆ బలహీనతలు బలంపుంజుకొని, కాలసర్పాలై బుసలు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.
"బెల్లం చుట్టూతే ఈగలు మూగుతాయి, నీరు పల్లం వైపే ప్రవహిస్తుంది, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు" ఇవన్నీ నగ్న సత్యాలు. అలాగే అధికారం చుట్టూనే రాజకీయ నాయకులు మూగుతారు. ప్రస్తుత కాలానికి ఇదీ నగ్నసత్యమే. ఇక్కడ నీతి, నిజాయతీ, నియమాలన్నీ బుట్టదాఖలే. ధర్మం, న్యాయం లాంటి వాటిని, బట్టలు విడిచేసినట్లు విడిచేసి, సిగ్గు-శరం వదిలేసి అధికార పార్టీలోకి చేరి పోతారు. దీనికి అతి గొప్ప ఉదాహరణ 2014 ఎన్నికలు పూర్తి అయిన తరవాత తెలంగాణలో "టీఆర్ఎస్" పార్టీలోకి భారీ ఎత్తున జరిగిన ఫిరాయింపులే. అలాగే ఆంధ్రప్రదేశ్ లో గంపగుత్తగా అమ్ముడుపోయి టిడిపి ప్రలోభాలకు లొంగి తమను తాము అమ్మెసుకున్న వైసిపి ప్రజాప్రతినిధులే.
కాంగ్రెస్, తెలుగుదేశం, వైసిపి పార్టీల జెండాల క్రింద గెలిచిన రాజకీయ నేతలు అంతా అధికారంలోకి వచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితిలో లోకి గోడ దూకేసి చేరిపోయారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, మరియు ఎంపీలు, వీళ్లంతా మూకుమ్మడిగా 'తెలంగాణ రాష్ట్ర సమితి'లోకి చేరిపోయారు.
ఈ చేరికల వెనుక ప్రధాన మరియు బలమైన కారణం తెరాస చేతిలో అధికారం ఉండటం. ఇలాంటి ఫిరాయింపులకు కేసీఆర్ ప్రాధాన్యతను ఇవ్వడం. దీని వల్లనే వారందరి చేరికలు జరిగాయి. ఆ సమయంలో కేసీఆర్ వాళ్లకు ఇచ్చిన ప్రధాన హామీల్లో కాంట్రాక్టులు, మంత్రి పదవులు, వచ్చే ఎన్నికల్లో టికెట్లు , ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఫిరాయింపులు పరుగులెత్తుతూ తెరాసలోకి చేరిపోయారు. మరి ఇప్పుడు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో, టికెట్ల పోరు కూడా త్వరలోనే రాజుకునే అవకాశం ఉంది.
*తెరాసలో ముందు నుంచి పోటీ చేసిన వాళ్లు,
*గత ఎన్నికల్లోతెరాస తరఫున పోటీ చేసి ఓడిన వాళ్లు,
*ఆ తర్వాత ఫిరాయించి టిఆరెస్ లోకి వచ్చిన వారు,
*కొత్తగా పుట్టుకు వచ్చిన ఆశవహులు
వీళ్లందరి మధ్యన టికెట్ల విషయంలో గట్టి పోటీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫిరాయించినవాళ్లు అంత తేలికగా అవకాశాలు వదులుకోరు.
*తెలుగుదేశం పార్టీ నుంచి పది మంది వరకూ ఎమ్మెల్యేలు,
*వైకాపా నుంచి ముగ్గురు,
*కాంగ్రెస్ నుంచి ఆరేడు మంది ఎమ్మెల్యేలు
*ఇంకా నలుగురు ఎంపీలు ఇతర పార్టీల నుంచి తెరాసలోకి ఫిరాయించారు.
అంటే ఓవరాల్ గా దాదాపు ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిరాయింపుల లొల్లి ఉండబోతోంది. వీరికి, పాత వారికి మధ్యన టికెట్ల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొన బోతోంది. ఇలాంటి నేపథ్యంలో టికెట్లే గనుక దొరకకపోతే, వీళ్లలో చాలా మంది మళ్లీ ఫిరాయించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇతర పార్టీల నుంచి తెరాసలోకి వచ్చిన వారికి, వారి పాత పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ వారికి స్వాగతం చెపుతుంది. అది రాహుల్ గాంధి ఆదేశమని సమాచారం. తెలంగాణా లో అమిత్ షా పర్యటన తరవాత ఇక్కడ బాజపా స్వతంత్రించే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి. అమిత్ షా మాత్రం ఖచ్చితంగా దక్షిణాదిని అంతతేలిగ్గా వదుకోబోరని సమాచారం. దీంతో కొంతమంది మళ్లీ వెనక్కు వెళ్లిపోవడం ఖాయమేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అనుభవఙ్జులైన విశ్లేషకుల అభిప్రాయం ఏమంటే ఎందుకు ముదస్తు ఎన్నికలకు వెళ్ళానురా! భగవంతుడా! అని కెసిఆర్ వేదన పడవలసిన రోజు ఖచ్చితంగా వస్తుందని. డి. శ్రీనివాస్ లాగా అంతర్గతంగా నలిగి పోయినవారు వారి స్వగృహాలకు వెళ్ళినా, వేరే పార్టీలో చేరినా “కేసిఆర్ విషయంలో ఆటం-బాంబులు” కావటాన్ని ఎవరూ నివారించలేరన్నది నూరు శాతం నిజం.