చేసుకున్న వాడికి చేసుకున్నంత అనే సామెత ఒకటి తెలుగులో చాలా పాపులర్. అది తెలంగాణాలోని సీనియర్ నేతల్లో ఒకరైన డి శ్రీనివాస్ కు బాగా వర్తిస్తుంది. దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నేతగా ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప మిగిలిన అన్నీ పదవులు పూర్తిగా అనుభవించారు. సొంత జిల్లా నిజామాబాద్ లో డిఎస్ కు పెద్దగా పట్టేమీ లేదు. ఏదో లేస్తే మనిషిని కాను అనే పద్దతిలో రాజకీయాలు చేస్తున్న విషయం అందరికీ తెలుసు.
మూడుసార్లు ఓడిపోయినా నెత్తిన పెట్టకున్న కాంగ్రెస్
ఎలాగంటే, సీనియర్ నేతగా ఉండి వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఘనచరిత్ర ఉంది డిఎస్ కు. 2009లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి తర్వాత 2012, 2014లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి ఓడిపోయారు. అయినా కానీ కాంగ్రెస్ అధిష్టానం డిఎస్ ను బాగానే గౌరవించింది. ఏరు దాటేముందు ఓడ మల్లన్న దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న పద్దతిలో డిఎస్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది.
రాజ్యసభ ఇచ్చి పక్కన పెట్టేసిన కెసిఆర్
దశాబ్దాల పాటు అధికారం అనుభవించిన డిఎస్ ప్రతిపక్షంలో ఐదేళ్ళు కూడా కూర్చోలేక ఏకంగా కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరిపోయారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించారు కాబట్టి అందరూ ఆయన్ను గౌరవిస్తున్నారు. అదే పద్దతిలో కెసిఆర్ కూడా మొదట్లో డిఎస్ ను నెత్తిన పెట్టుకున్నారు. పార్టీలోకి వచ్చిన వెంటనే రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించారు. అంతే, తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు. కారణం ఏమిటంటే 2014 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ నుండి కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గెలవటమే.
సొంత జిల్లాలోనే అవమానాలు
డిఎస్ జిల్లా నుండి కవిత కూడా ఎంపిగా గెలవటంతో సహజంగానే పార్టీ అయినా ప్రభుత్వ యంత్రాంగమైనా కవిత చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడా అదే జరిగింది. డిఎస్ ను పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దాంతో డిఎస్ లో అసంతృప్తి మొదలై పెరిగి పెద్దదైపోయింది. చివరకు డిఎస్ పై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని కవిత సిఎంకు ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది. చివరకు డిఎస్ మీడియాతో మాట్లాడుతూ, తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు సిద్దమనేంత ధీనస్ధితిలో పడిపోయారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిందిగా కోరారు. తనంతట తానుగా పార్టీకి దూరమైతే కవిత తనపై చేసిన ఫిర్యాదులు నిజమనుకుంటారని ధీనంగా అభ్యర్దించటంతోనే అర్ధమైపోతోంది టిఆర్ఎస్ లో డిఎస్ పరిస్దితేంటో.
త్వరలో ఢిల్లీకెళుతున్నారా ?
పరిస్దితి ఇంతదాకా వచ్చిన తర్వాత డిఎస్ ఇక టిఆర్ఎస్ లో ఉండలేరన్నది వాస్తవం. ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు ? ఏం చేస్తారంటే మళ్ళీ కాంగ్రెస్ లోకే వెళతారు. ఎందుకంటే, కాంగ్రెస్ తప్ప డిఎస్ కు వేరే దారిలేదు. ఎటూ డిఎస్ కు కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ లో చేరటం డిఎస్ కు పెద్ద కష్టమేమీ కాబోదు. ఎందుకంటే డిఎస్ కాంగ్రెస్ లోకి వస్తానంటే ఆహ్వానిస్తామని గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ రాజనర్సింహ ఇప్పటికే ప్రకటించేశారు. ఈనెల 11వ తేదీన డిఎస్ ఢిల్లీకి వెళుతున్నట్లు ప్రచారం మొదలైంది. కాబట్టి తొందరలోనే డిఎస్ కాంగ్రెస్ లో చేరే ముచ్చట చూడొచ్చు.