తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఈరోజు స్పీకర్ కార్యాలయంలో అందచేశారు. పోయిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏగా రేవంత్ గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే . అయితే, ఆ తర్వాత తలెత్తిన రాజకీయ పరిణామాలతో టిడిపికి రేవంత్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుండి కాంగ్రెస్ లోనే రేవంత్ క్రియాశీలకంగా ఉంటున్నారు.
స్పీకర్ కార్యాలయంలో అందచేత
దాదాపు ఏడాది క్రితం టిడిపిలో నుండి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి అప్పట్లో తన రాజీనామా లేఖను స్పీకర్ కు అంచేయలేదు. విజయవాడకు వెళ్ళి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన రేవంత్ అప్పట్లో తన రాజీనామా లేఖను చంద్రబాబుకు అందించటమే విచిత్రం. ఏపికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు తన రాజీనామా లేఖ ఇవ్వటంలో నిజంగా అర్ధమే లేదు. చిత్తశుద్ది ఉంటే రాజీనామా లేఖను ఇవ్వాల్సింది తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ మదుసూధనాచారికే. కానీ రేవంత్ మాత్రం ఆపనిచేయకుండా ఇంతకాలం ఎంఎల్ఏ పదవిలోనే కొనసాగారు.
ఎంఎల్ఏలుగా కొనసాగుతున్న ఫిరాయింపులు
మూడు రోజులుగా తెలంగాణాలో మారిపోతున్న రాజకీయ వాతావరణంతో ముందస్తు ఎన్నికలు ఖాయమని అర్ధమైన తర్వాత రేవంత్ హటాత్తుగ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా విలువలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పుకోవటానికే రేవంత్ రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, కాంగ్రెస్, టిడిపిల తరపున పోయిన ఎన్నికల్లో గెలిచిన ఎంఎల్ఏలను కెసిఆర్ టిఆర్ఎస్ లోకి లాక్కున్న విషయం అందరూ చూసిందే. ఫిరాయించిన వారెవరూ ఇప్పటి వరకూ రాజీనామాలు కూడా చేయలేదు. పైగా ఒకరిద్దరికి కెసిఆర్ మంత్రిపదవులను కూడా కట్టబెట్టారు.