ఒక విషయంలో తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మెచ్చుకోవాల్సిందే. కెసిఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా మంది ఎంఎల్ఏలపై అవినీతి ఆరోపణలున్నాయి. ఎలాగూ సిట్టింగ్ ఎంఎల్ఏలంటే జనాల్లో ఎంతో కొంత వ్యతిరేకత అయితే తప్పదు. అటువంటిది అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసిన తర్వాత ఒకేసారి ఏకంగా 105 మందికి టిక్కెట్లను ప్రకటించేశారు. అందులో దాదాపు 70 మంది సిట్టింగులే అంటే మాజీ ఎంఎల్ఏలే ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో నేతల అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ సిట్టింగులకే కెసిఆర్ టిక్కెట్లివ్వటం ఆశ్చర్యంగా ఉంది.
ఒకేసారి 105 మందికి టిక్కెట్లు
అంతమందికి ఒకేసారి టిక్కెట్లు ప్రకటించటమంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే పలువురు ఎంఎల్ఏలపైన పార్టీలోనే తిరుగుబాట్లు మొదలయ్యాయి. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగులపై పలువురు నేతలు తమ అసంతృప్తిని నేరుగా కెసిఆర్ ముందే వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగులపై ఏకంగా సిఎంతోనే ఫిర్యాదు చేస్తున్నారంటే నియోజకవర్గంలోని జనాల్లో వారిపై ఇంకెంత అసంతృప్తి ఉందో అర్ధం చేసుకోవచ్చు.
బయటపడుతున్న వ్యతిరేకత
రెండు రోజుల క్రితం అంటే అసెంబ్లీ రద్దుకు ముందు రోజు టిఆర్ఎస్ భవన్లో ప్రజాప్రతినిధులతో కెసిఆర్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం ఎంఎల్ఏ బొడిగె శోభకు వ్యతిరేకంగా పలువురు నేతలు కెసిఆర్ కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు రామగుండం, వేములవాడ నియోజకవర్గాల ఎంఎల్ఏలు సోమారపు సత్యనారాయణ, చెన్నమనేని రమేష్ లపైన కూడా నేతలు కెసిఆర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి ఫిర్యాదులు చాలా నియోజకవర్గాల నుండి కెసిఆర్ అందుకున్నారు.
60 మందిపై తీవ్ర వ్యతిరేకత
రామగుండం, వేముల వాడలో సిట్టింగులపై వ్యతిరేకత ఉన్నా లెక్క చేయకుండా కెసిఆర్ మళ్ళీ వాళ్ళకే టిక్కెట్లిచ్చారు. అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న బొడిగె శోభను మాత్రం పక్కనపెట్టారు. ఇపుడు కెసిఆర్ టిక్కెట్లు ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల్లో కనీసం 60 మందిపై ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం మొదలైపోయింది. జాబితాను చూసిన వాళ్ళల్లో చాలా మంది పెదవి విరుస్తున్నారు.
కెసిఆర్ ధైర్యమేంటో ?
అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలీదు. కెసిఆర్ ఆశిస్తున్నట్లు నవంబర్లో జరగవచ్చు లేదా షెడ్యూల్ ప్రకారమే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పై రెండింటిలో ఏది జరిగినా అభ్యర్ధులకు ఇబ్బందే. టిక్కెట్లు ఆశించిన వాళ్ళు లేకపోతే చివరి నిముషంలో అభ్యర్ధులను మార్చినా పార్టీకి ఇబ్బందులు తప్పవు. అభ్యర్ధులను వ్యతిరేకిస్తున్న నేతలు ప్రత్యర్ధిపార్టీల అభ్యర్ధులతో కలిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలే సిట్టింగులపై వ్యతిరేకత. దానికి తోడు ప్రతిపక్షాలతో చేతులు కలపటం. ఈ ప్రమాదాలు కెసిఆర్ ఊహించలేని వారైతే కాదు. అయినా అన్నీ తెలిసి కూడా ఇంత సాహసానికి దిగారంటే కెసిఆర్ ను మెచ్చుకోవాల్సిందే.