కేసీఆర్ పాలనలో ఒక విమర్శ మాత్రం గట్టిగా వినిపిస్తుంటుంది. అదేమిటంటే మంత్రి వర్గంలో మహిళా నేత లేకపోవడం. ఎందుకో కేసీఆర్ ఈ విషయం అసలు పట్టించుకోలేదు. సామాజికవర్గాలవారీగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ మంత్రివర్గంలో మాత్రం చోటు కల్పించలేదు. దీనిపై ప్రతిపక్షాలు అనేకసార్లు విమర్శలు చేసినా టీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ కిమ్మనలేదు.
కేసీఆర్ ఎన్నడూ వివరించలేదు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే మహిళకు మంత్రిపదవి ఇస్తారా? మహిళలకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడం ఏ రాష్ట్రంలోనూ జరగదు. కాని కేసీఆర్ చేసి చూపించారు. రాష్ట్రవిభజన జరిగి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మహిళలకు స్థానం కల్పించకపోవడం వారిని అవమానించినట్లే. అలనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనే కాదు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ మహిళలు మరపురాని పాత్ర నిర్వహించారు.
అన్ని సామాజికవర్గాల, అన్ని వృత్తుల్లోని మహిళలు, గ్రామీణ మహిళలు, పట్టణాల్లోని వనితలు, ప్రధానంగా ఉద్యోగినులు శక్తిస్వరూపిణులై పోరాడారు. కాని ఏం ప్రయోజనం? కేసీఆర్ పట్టించుకోలేదు. టీఆర్ఎస్ తరపున ఆరుగురు ఎమ్మెల్యేలు గెలవగా ఒక్కరికి కూడా మంత్రిపదవి ఎందుకు ఇవ్వలేకపోయారనే ప్రశ్నకు ఇప్పటివరకు జవాబులేదు. గతంలో హైదరాబాదులో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సు జరిగిన తరువాత ఒక్క మహిళకైనా మంత్రిపదవి ఇస్తారని అనుకున్నారు.