ఇపుడందరిలోనూ అవే ప్రశ్నలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీ అన్నాక సొంతంగా పార్టీ కార్యాలయం ఉండాలని అనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ మరీ ఇంత భారీ ఎత్తు నిర్మించాలని తెలుగుదేశంపార్టీ నాయకత్వం అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. టిడిపి నాయకత్వం అంటే ఇక్కడ చంద్రబాబునాయుడు, నారా లోకేష్ తప్ప ఇంకోరు లేరన్న విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ లోకేష్ తన అధికారిక ట్విట్టర్లో వివరాలతో కూడిన ట్వీట్ ను చూసిన వాళ్ళకు మతిపోతోంది, అలా ఉంది భవనాల నమూనా.
2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం
ట్విట్టర్లో కనిపిస్తున్న ఫొటోల డిజైన్ల ప్రకారం, వివరాల ప్రకారం భవనాలు పూర్తవ్వటానికి ఎంత తక్కువేసుకున్నా వందల కోట్ల రూపాయల మాటే. 2 లక్షల చదరపు అడుగుల్లో మూడు బ్లాకులుగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం భవనాలు పూర్తయ్యేసరికి ఎంత లగ్జరీగా ఉంటుందో ఎవరికి వాళ్ళుగా ఊహించుకోవాల్సిందే. ఈ భవనాలను అత్యంత ఆధునిక సౌకర్యాలతో దేశంలోనే ఇప్పటి వరకూ ఏ పార్టీకి లేనంత భారీగా నిర్మిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలోని సమాచారం ప్రకారమైతే భవనాల నిర్మాణ ఖర్చు సుమారు రూ. 800 కోట్లట.
భవనాలను నిర్మిస్తున్నదెవరు ?
యాధృచ్చికమో ఏమో తెలీదు కానీ ఇక్కడ రెండు అంశాలను ప్రస్తావించుకోవాలి. హైదరాబాద్ హైటెక్ సిటీ లో సైబర్ టవర్స్ నిర్మించిన తర్వాత జూబ్లిహిల్స్ లో ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ నిర్మాణం జరిగింది. సైబర్ టవర్స్ నిర్మించిన ఎల్ అండ్ టి సంస్ధే ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కూడా నిర్మించిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అదే పద్దతిలో ఇపుడు కూడా ప్రచారం మొదలైపోయింది.
ఆ సంస్ధలపైనే ఆరోపణలు
అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనాలను ఎల్ అండ్ టీ, షాపూర్ జి పల్లోంజి సంస్ధలు సంయుక్తంగా నిర్మించాయి. సుమారు రూ. 300 కోట్లతో మొదలైన తాత్కాలిక భవనాల నిర్మాణ వ్యయం చివరకు రూ వెయ్యికోట్ల దాకా చేరుకుంది. ఇక్కడే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, స్ధానికంగా చదరపు అడుగుకు మహా అయితే 3500 రూపాయలు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 11 వేలు చెల్లించిందని వైసిపి, బిజెపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అదే ఇపుడు తాజా ఆరోపణలకు ఊతమిస్తోంది.
కార్యాలయం నిర్మాణానికి ఎందుకంత తొందర ?
త్వరలో మొదలయ్యే టిడిపి రాష్ట్ర కార్యాలయం భవనాలను పై రెండు సంస్ధల్లో ఏదో ఒకటి ఉచితంగా నిర్మించి ఇస్తోందనే ఆరోపణలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. తాజాగా లోకేష్ ట్విట్టర్లో భవనాల డిజైన్లు చూసిన తర్వాత ఆరోపణలు మరింతగా ఊపందుకున్నాయి. భవనాలకు అయ్యే వ్యయాన్ని పార్టీ అయితే సొంతంగా భరించే అవకాశమే లేదన్నది వాస్తవం. టిడిపి కార్యాలయం భవనాలను మరి ఇంకెవరు నిర్మించిస్తారు ? లోకేష్ ట్వీట్ ప్రకారం మూడు బ్లాకులుగా నిర్మితమయ్యే భవనాలను ఈ ఏడాది చిరవకు కానీ లేదా వచ్చే ఏడాది మొదట్లో కానీ ప్రారంభిస్తారు. అంటే భవనాల నిర్మాణ పనులను ఎంత వేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారో అర్ధమైపోతోంది. 2050 వరూ టిడిపినే అధికారంలో ఉంటుందని తరచూ చెప్పే చంద్రబాబునాయుడు పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణానికి ఎందుకంత తొందరపడుతున్నారో ?