ముందస్తు ఎన్నికల సిఫారసు నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఉద్దేశ్యంతో కెసిఆర్ అసెంబ్లీ రద్దు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళితే టిఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగిపోతుందని, ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా దెబ్బ కొడదామన్న వ్యూహంతోనే కెసిఆర్ ముందస్తుకు వెళుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రతిపక్షాలు కూడా సిద్ధంగానే ఉన్నాయి
అయితే,కెసిఆర్ ముందస్తు నిర్ణయం హటాత్తుగా తీసుకున్నదేమీ కాదు. అసెంబ్లీని ఏ రోజైనా కెసిఆర్ రద్దు చేసకునే అవకాశం ఉందని మీడియాలో ఎప్పటి నుండో కథనాలు వస్తున్నాయి. దాంతో ప్రతిపక్షాలు కూడా అందుకు అనుగుణంగానే తమ రాజకీయం మొదలుపెట్టేశాయి. నేతలు, శ్రేణులను కాంగ్రెస్, టిడిపి, వామపక్షాలు, బిజెపిలు మానసికంగా సిద్దం చేశాయి. దాంతో కెసిఆర్ నిర్ణయంతో ఇరుకునపడే ప్రతిపక్షాలేవీ లేవన్నది వాస్తవం.
పొత్తులే కీలకం
అభ్యర్ధుల ఎంపిక కసరత్తు అన్నీ పార్టీల్లోను మొదలైపోయాయి. కాంగ్రెస్ పార్టీ పరంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక కూడా అయిపోయింది. ఉండటానికి తెలంగాణాలో చాలా పార్టీలే ఉన్నప్పటికి టిఆర్ఎస్ ను ఢీ కొనే శక్తి ఉన్నది మాత్రం కాంగ్రెస్ కు మాత్రమే. టిడిపి అంటారా క్యాడర్ బలంగా ఉన్నా లీడర్లు లేరు. అందుకే కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారు. ఆ రెండు పార్టీలు గనుక కలిస్తే కెసిఆర్ కు కష్టమే. తొందరలోనే రెండు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ నిర్ణయమైపోతే పొత్తులపై బహిరంగ ప్రకటనుంటుందని సమాచారం. పొత్తుల విషయంపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, మధుయాష్కి, బోస్ రాజుతో కమిటి వేసింది. ఎటూ చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నారు. కాబట్టి టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ తదితరలతో కూర్చుని ఫైనల్ చేసుకునే అవకాశాలున్నాయి. అందులో భాగంగానే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వరసుపెట్టి నేతలతో కీలక సమావేశాలు పెడుతూ దూకుడు పెంచుతున్నారు.