తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బాల్కొండ నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ, ఉమ్మడి రాష్ట్రం మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. ఈరోజు ఉదయం సురేష్ రెడ్డి ఇంటికి కెసిఆర్ కుమారుడు, ఆపద్ధర్మ మంత్రి కె. తారక రామారావు (కెటిఆర్), వివేక్, తాజా మాజీ ఎంఎల్ఏలు జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలిసి వెళ్ళారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ సురేష్ టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు.
టిఆర్ఎస్ లో చేరుతున్నాను
తర్వాత సురేష్ రెడ్డి మాట్లాడుతూ తాను టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. తన మద్దతుదారులు, మిత్రులతో మాట్లాడి త్వరలో టిఆర్ఎస్ లో చేరుతానని ప్రకటించారు. రాష్ట్రం త్వరగా వేగంగా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ కెసిఆరే ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రభుత్వమనే వాహనాన్ని కెసిఆర్ అనే డ్రైవర్ బాగా నడుపుతున్నారు కాబట్టి డ్రైవర్ ను మార్చాల్సిన అవసరం లేదని సురేష్ అభిప్రాయపడ్డారు. సరే, ఎటూ టిఆర్ఎస్ లో ప్రకటించేశారు కాబట్టి కెసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
టిక్కెట్టు ఆశించి చేరలేదు
అయితే, ఎన్నికలకు ముందు సురేష్ టిఆర్ఎస్ లో చేరటంతో నియోజకవర్గంలో సమీకరణలు మారే అవకాశం ఉంది. ఎందుకంటే, బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డికి టిక్కెట్టు ప్రకటించేశారు. కాబట్టి ఇపుడు అభ్యర్ధిని మార్చే అవకాశం లేదు. కాబట్టి సురేష్ కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దాదాపు లేనట్లే. టిక్కెట్టు ఆశించి తాను టిఆర్ఎస్ లో చేరటం లేదని సురేష్ కూడా ప్రకటించారు. కాబట్టి అధికారంలోకి వస్తే సురేష్ కు ఏమన్నా మంచి పదవి వచ్చే అవకాశం ఉంది. సురేష్ లాగ ఇంకెంతమంది నేతలు ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగిపోతారో చూడాల్సిందే.