కేసీఆర్ అసెంబ్లీ ను రద్దు చేసి ఎన్నికల సమర శంఖాన్ని పూరించాడు. దీనితో తెలంగాణ లో అప్పుడే ఎన్నికల కళ వచ్చేసింది. జన ఆశీర్వాద సభ' పేరుతో ఎన్నికల సమరశంఖం పూరించబోతున్నారు కేసీఆర్. ఈరోజు సాయంత్రం హుస్నాబాద్ బహిరంగ సభతో టీఆర్ఎస్, ఎన్నికల ప్రచారం షురూ అయినట్లే. 105 మంది అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించేసిన దరిమిలా.. గులాబీ శ్రేణులు ప్రచార బరిలోకి ఆల్రెడీ దిగిపోయినట్లే.
ఇక, 2014 ఎన్నికల్లో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతుందన్న దానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతాలేదు. తెలంగాణ నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఒకరిద్దరు నేతలు కన్పిస్తున్నా, వారెవరూ పార్టీని తెలంగాణలో లీడ్ చేసే పరిస్థితి లేదన్నది ఓపెన్ సీక్రెట్. తెలంగాణ బాధ్యతల్ని గతంలో వైఎస్ జగన్, తన సోదరి షర్మిలకి అప్పగించారు.
కానీ, ఆమె ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. ఏపీ నుంచి ఎంపీగా షర్మిల పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న దరిమిలా.. ఆమె మళ్ళీ తెలంగాణలో వైఎస్సార్సీపీ బాధ్యతల్ని స్వీకరించే అవకాశాలు లేనట్లే. సో, తెలంగాణలో వైఎస్సార్సీపీ చేతులెత్తేసినట్లే భావించాల్సి వుంటుంది. ఇంతకీ, జనసేన పార్టీ పరిస్థితి ఏంటట.? ఆ పార్టీ తరఫున తెలంగాణ నేతలెవరూ ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటనా చేయలేదుగానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, తెలంగాణ ఎన్నికల విషయంలో జనసేన 'తటస్థంగా' వుండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.