ఆడలేక మద్దెల ఓడన్నారట వెనకటికి ఒకడు అన్నది చాలా పాపులర్ సామెత. చూడబోతే అలానే ఉంది కెసిఆర్ మాటలు వింటుంటే. షెడ్యూల్ ఎన్నికలకు తొమ్మిది నెలల కాలం ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నదే కెసిఆర్. అసలు మధ్యంతర ఎన్నికలకే వెళ్ళాలని ఎప్పుడో అనుకున్నా ధైర్యం చేయలేకపోయారు. ఇపుడు ముందస్తు ఎన్నికలకు తెరతీసిన కెసిఆర్ అందుకు ప్రతిపక్షాలను కారణంగా చూపిస్తుండటమే విచిత్రంగా ఉంది.
తన కుటుంబంపై ఆరోపణలే కారణమట
తనపైన, తన కుటుంబంపైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాయట ప్రతిపక్షాలు. అభివృద్ధికి పదే పదే అడ్డుపడుతున్నాయట. అవినీతిని నిరూపించటమని తాను సవాలు చేసినా పట్టించుకోకుండా మళ్ళీ అవే ఆరోపణలు చేస్తున్నాయట. ప్రతిపక్షాల వల్ల రాజకీయ వాతావరణం కలుషితమైపోతున్నట్లు ఆరోపించారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకు అభివృద్ధిపై జనాలకు చెప్పుకునేందుకే మధ్యంతర ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పటం విచిత్రంగా ఉంది.
మళ్ళీ ఆరోపణలు చేస్తే ఏం చేస్తారు ?
ప్రతిపక్షాల ఆరోపణలకు నిరసనగానే మధ్యంతరానికి వెళుతున్నదే నిజమైతే మాత్రం కెసిఆర్ అబద్దాలు చెబుతున్నట్లు అర్దమైపోతోంది. ఎందుకంటే ప్రతిపక్షాలన్నాక ప్రభుత్వంపై ఆరోపణలే చేస్తాయి. ప్రతిపక్షాల ఆరోపణలు తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత పాలకపార్టీపైనే ఉంటుంది. ఆరోపణలకు జవాబు ఇచ్చుకోలేక మధ్యంతరానికి వెళ్ళటం ఎంత వరకూ సబబో కెసిఆరే చెప్పాలి. ఒకవేళ రేపటి ఎన్నికల్లో మళ్ళీ కెసిఆర్ గెలిచారనే అనుకుందాం. అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉంటాయి కదా ? అప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటారా ? ప్రత్యేక తెలంగాణా రావటానికి ముందు టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయలేదా ?