తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. గురువారం నాడు అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేయడం.. గవర్నర్కు తీర్మానాన్ని అందించడం.. ఆ వెంటనే గెటిజ్ విడుదల కావడం.. పార్టీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడం.. చకచకా జరిగిపోయాయి. మొత్తంగా ఒక్కరోజులోనే కేసీఆర్ తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేశారు. మూడు నెలలుగా ముందస్తుకు కసరత్తు మొదలు పెట్టిన కేసీఆర్ అందుకు రాజకీయ, సాకేంతిక అడ్డంకులు ఎదురుకాకుండా.. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లారు. అయితే.. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కొన్ని ఊహకందని పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
అందులో ప్రధానంగా ప్రధాని మోడీ.. కేసీఆర్ మద్య కుదిరిన అంతర్గత ఒప్పందం ఏమిటనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ రహస్య ఒప్పందంలో రెండు అంశాలు ప్రధానంగా ఉండే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. దక్షిణాదిన బీజేపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. దక్షిణాది నుంచి ఎన్డీయే మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన టీడీపీ కూడా బయటకు వచ్చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో చంద్రబాబు బయటకు వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో సత్సంబంధాలు నెరపాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా పరస్పర లాభం ఉండేలా ఒప్పందం జరిగినట్లు తెలిసింది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సహకరిస్తే.. వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీకి మద్దతు తెలుపడంతోపాటు తెలంగాణలోని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలను కాపాడే బాధ్యత కేసీఆర్ తీసుకున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో బీజేపీ ఐదు స్థానాల్లో గెలిచింది. అవి కూడా గ్రేటర్ హైదరాబాద్లోనే కావడం గమనార్హం. అయితే..ఈ ఐదు స్థానాల్లో మళ్లీ బీజేపీ గెలిచేలా సహకరిస్తానని కేసీఆర్ మోడీకి గట్టి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు బలాన్ని ఇచ్చేలా కేసీఆర్ కదలికలు కూడా ఉన్నాయి. గురువారం నాడు కేసీఆర్ 105మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. 14 స్థానాలను పెండింగ్లో పెట్టారు. ఇందులో ఐదు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కూడా ఉన్నాయి.
అయితే.. ఎలాగూ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు ఉండదుకాబట్టి.. ఆయా స్థానాల్లో బలహీనమైన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి, బీజేపీ అభ్యర్థులు గెలిచేలా కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తారనే టాక్ వినిపిస్తోంది. బీజేజీ సిట్టింగ్ స్థానాలు ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్పేట, గోషామహల్, ఉప్పల్. ఈ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు కేసీఆర్. అంటే ఇక్కడ టీఆఎస్ నుంచి ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమన్నమాట. ఇక ఎంఐఎంతో ఫ్రెండ్లీ పోరు ఉంటుందని చెప్పకనే చెప్పారు.