తెలంగాణాలో రాబోయే ఎన్నికల వ్యయం మొత్తం ఎవరు భరిస్తారు ? ఇపుడిదే ప్రశ్న తాజాగా కాంగ్రెస్, టిడిపి నేతల మధ్య జోరుగా చర్చలు జరుగుతున్నాయి. టిఆర్ఎస్ అభ్యర్ధుల ఖర్చుల కోసం నిధులను కెసిఆర్ రెడీ చేశారంటూ ప్రచారం ఎప్పటి నుండో జరుగుతున్నదే. బిజెపికి కూడా నిధుల సమస్య ఉండదు. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా ఏదో ఓ రూపంలో అభ్యర్ధులకు నిధులు అందుతాయి. వామపక్షాలు, జనసేనతో పాటు ఇతర చిన్నా చితకా పార్టీల ఖర్చులను ఎవరూ పట్టించుకోరు.
ఖర్చులే ప్రధాన సమస్య
మరి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పరిస్ధితేంటి ? కెసిఆర్ పై మండిపోతున్న తెలుగుదేశంపార్టీ ఏం చేస్తుంది ? అన్నదే ప్రధానమైన ప్రశ్న. ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు ఖరారైపోయినట్లే. కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాక వ్యయం విషయాలను కూడా మాట్లాడుకుంటాయి కదా ? అదే ఇపుడు ప్రధాన సమస్యగా మారిపోయింది.
నియోజకవర్గానికి రూ. 25 కోట్లా ?
ఓసి నియోజకవర్గాల్లో కూడా రాబోయే ఎన్నికల్లో తక్కువలో తక్కువ రూ. 25 కోట్లు ఖర్చవుతుందని ఓ అంచనా. ప్రధాన పార్టీల తరపున పోటీ చేయాలని అనుకుంటున్న ఏ అభ్యర్ధికైనా ఆ ఖర్చు తప్పదు. తెలంగాణాలో కాంగ్రెస్, టిడిపిలు ప్రతిపక్షాల్లోనే ఉన్నాయి కాబట్టి ఆదాయ మార్గాలు లేవు. ఏపిలో తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉంది కాబట్టి రెండు పార్టీల అభ్యర్ధుల ఖర్చులను భరించాల్సిన బాధ్యత ప్రధానంగా చంద్రబాబునాయుడు మీదే ఉంది. తనంతట తానుగా కాంగ్రెస్ తో పొత్తులకు రెడీ అవ్వటంతో పాటు కెసిఆర్ ను గద్దె దింపటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్ధుల ఖర్చులను పెట్టుకోవటానికి వెనకాడరనే అనుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం జేబులో డబ్బు ఖర్చు పెడతారా ? అసలే చేతికి వాచి, ఉంగరం కూడా లేని మహనీయుడు కదా ? మరి ఎక్కడ నుండి నిధులు సర్దుతారో ? చూడాల్సిందే ?