చూడబోతే పరిస్దితి అలాగే కనబడుతోంది. ఈరోజు తాజా మాజీ ఎంఎల్ఏ కొండా సురేఖ మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలకు చాలా అర్ధాలే కనబడుతోంది. చాలా మందిలో ఉన్న అనుమానాలనే కొండా లెవనెత్తారు. సిట్టింగ్ ఎంఎల్ఏగా ఉన్న తనకు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఎందుకు టిక్కెట్టు ప్రకటించలేదని కెసిఆర్ ను సూటిగా ప్రశ్నించారు. మీడియా సమావేశంలో సురేఖ మటలు విన్న తర్వాత ఆమె ఎక్కువ రోజులు టిఆర్ఎస్ లో ఉండరన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది.
కొండా ప్రశ్నలకు సమాధానాలిస్తారా ?
అయితే, మీడియా సమావేశంలో ఆమె లేవనెత్తిన ప్రశ్నలు చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. అదే విధంగా టిక్కెట్ల హామీతో టిఆర్ఎస్ లో చేరిన వారిలో కూడా సురేఖ ప్రశ్నలు ఆలోచింప చేసేవిగానే ఉన్నాయి. పోయిన ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో సురేఖ 55 వేల మెజారిటీతో గెలిచారు. స్వతహాగా దూకుడుగా ఉండే కొండా దంపతులపై పార్టీలోని కొందరు నేతలకు ఇష్టంలేని మాట వాస్తవం. ఇపుడదే ఆమెకు టిక్కెట్టు ప్రకటించకపోవటానికి కారణంగా ఆమె అనుమానిస్తున్నారు. తనకు టిక్కెట్టు ప్రకటించకపోవటానికి కెసిఆర్ కుమారుడు కెటిఆరే కారణమని కూడా ఆమె సూటిగా ఆరోపిస్తున్నారు.
ఎందుకు టిక్కెట్టు నిరాకరించారు ?
కెసిఆర్ చేయించుకున్న అనేక సర్వేల్లో తన పనితీరుపై 69 శాతం సంతృప్తి కనబడిందంటున్నారు. 33 శాతం మార్కులు వచ్చిన వారికి కూడా టిక్కెట్లు ప్రకటించి తన టిక్కెట్టును మాత్రం ఆపటానికి కారణమేంటని కెసిఆర్ ను నిలదీస్తున్నారు. సొంత కోటరీని తయారు చేసుకునేందుకే ముందు జాగ్రత్తగా తనలాంటి వాళ్ళకు టిక్కెట్లు ప్రకటించలేదంటూ మండిపడ్డారు.
టిక్కెట్లు రానివారందరికీ వర్తిస్తుందా ?
ఇక సురేఖ లేవనెత్తిన ప్రశ్నలను చూద్దాం. మొదటిది ఇతర పార్టీల నుండి ఫిరాయించిన ఎంఎల్ఏలకు కూడా టిక్కెట్లు ప్రకటించిన కెసిఆర్ కారు గుర్తుపైనే గెలిచిన తమలాంటి వాళ్ళకు టిక్కెట్లు ఎందుకు ఆపేశారని అడుతున్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకపోయినా టిక్కెట్టు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. ఇతర పార్టీల నుండి టిక్కెట్ల హమీతో టిఆర్ఎస్ లోకి లాక్కున వాళ్ళలో ఎందరికి టిక్కెట్లిచ్చారో చెప్పాలన్నారు. ఇపుడు ప్రకటించిన 105 మందికి బిఫారమ్ లు ఖాయంగా ఇస్తారా ? అంటూ కెసియార్ ను నిలదీశారు.
కెసిఆర్ పై మండిపడిన కొండా
టిక్కెట్ల కేటాయింపులో తనకు జరిగిన అన్యాయమే చాలామందికి జరిగింది కాబట్టి తనలాగ మోసపోయిన వారందరూ కెసిఆర్ గురించి, టిఆర్ఎస్ లో కొనసాగే విషయమై ఆలోచించాలంటూ పిలుపిచ్చారు. తెలంగాణా రాష్ట్రమేమీ కల్వకుంట్ల ఇల్లు కదన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. బిసిలకు, మహిళలకు కెసిఆర్ చేస్తున్న అన్యాయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. తన ప్రశ్నలకు టిఆర్ఎస్ ఇచ్చే జవాబుపైనే తన నిర్ణయం ఉంటుందంటూ స్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో సురేఖ త్వరలో కాంగ్రెస్ లో చేరటం ఖాయమని సమాచారం.