చంద్రబాబునాయుడులో త్వరలో కేంద్రప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్ధలు దాడులు చేయబోతున్నాయా ? టిడిపిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి. దానికితోడు ఈరోజు సాయంత్రం తెలంగాణా టిడిపి సమావేశంలో స్వయంగా చంద్రబాబు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేయటంతో పార్టీలో సర్వత్రా తీవ్ర ఆందోళన మొదలైపోయింది.
సినీనటుడు శివాజీ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు రెండు మూడు రోజుల్లో కేంద్ర దర్యాప్తు సంస్దల నుండి నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు. ఢిల్లీలోకి కీలక నేత నుండి తనకు అర్ధరాత్రి ఫోన్ వచ్చిందని చెప్పటంతో దాంతో చిచ్చు మొదలైంది. దాని తర్వాత సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను అస్దిరపరచటానికి కేంద్రం ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. తమిళనాడు, కర్నాటకలో ప్రయత్నించారంటూ ధ్వజమెత్తారు. రేపు తెలంగాణాలోను తర్వాత ఏపిలో కూడా అస్దిరత్వం సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ అనుమానం వ్యక్తం చేశారు.
సమావేశంలో చంద్రబాబు తర్వాత మాట్లాడిన యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్యలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తు నోటీసులపైనే మాట్లాడటం గమనార్హం. గడచిన నాలుగేళ్ళుగా చంద్రబాబుపై అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న మాట అందరికీ తెలిసిందే. దానికితోడు కేంద్రప్రభుత్వం నడిచే అనేక పథకాల అమలులో కూడా బారీ ఎత్తున అవినీతి జరిగిందని స్వయంగా బిజెపి నేతలే ఆరోపిస్తున్నారు. ఎప్పటి నుండో దాడులు చేస్తారని, నోటీసులు ఇస్తారని చంద్రబాబే గతంలో అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికలకు ముందు మళ్ళీ అటువంటి అనుమానాలు మొదలయ్యాయంటే తెరవెనుక ఏదో జరుగోతందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.