తెలంగాణా ఉద్యమాన్ని కేసిఆర్ కాడి వడిలేసినప్పుడల్లా దానికి జవం- జీవం దిశ-దశ మార్గదర్శకుడు తానే అయి ముందుకు నడిపిన 100% ఉపాద్యాయుడు కోదండరాం. ఉద్యమకాలంలో ఆంధ్ర ఆధిపత్య ప్రభుత్వాలు, ఆంధ్ర యాజమాన్య మీడియా బయపడింది కేసిఆరుకు కాకుండా ప్రొఫెసర్ కోదండరాం గారికి మాత్రమే బయపడేవారు. ఎందుకంటే ఆయనోక కొరకరాని కొయ్య. సిద్ధాంత నిబద్ధుడు.
అందుకే రాష్ట్ర విభజన తరవాత కోదండరాం గారికి ఏపి యాజమాన్య
మీడియా సహకరించలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కోదండరాం గారికి చెందిన వార్తలకు
ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇప్పటికీ చూస్తున్నాయి. తెలంగాణా ఏర్పడటంపై అయిష్టత, కోదండరాం
పై అయిష్టతగా మార్చేసుకున్నారన్నది నూరుపాళ్ళు నిజం.
తెలంగాణ ఉద్యమంలో 'తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ' పేరుతో అన్ని పార్టీలను ఏకం చేసిన వారికి మార్గదర్శనం చేస్తూ ముందుకు నడిపించిన కోదండరాంకు ఈ కాలం రాజకీయాలు ఒకపట్టాన ఒంటపట్టలేదు. ఆందుకే చివరికి ఒంటరి గానే మిగిలారు.
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కారణాలు ఏమో తెలియదు
గానీ, ఆయనతో సిద్ధాంత పరంగా వ్యక్తిగతంగా విభేదించి ముఖ్యమంత్రికి దూరంగా ఉన్నారు.
దీంతో కేసీఆర్ కోదండారాంను ఇతర నాయకులతో బుజ్జగింపజేసినా, కోదండను కలుపు కోవటానికి ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదు. దీంతో పార్టీ నాయకులు సైతం కోదండారాంపై విరుచుకుపడ్డారు. “తమతో కలవనివారిని స్వార్ధపరులుగానో, తెలంగాణా విద్రోహులు గానో ముద్రవేసే కేసిఆర్ కుటుంబ నాయకత్వానికి ఈయన మింగుడు పడతేదు. కొద్దికాలానికి సీపీఎం లాంటి పార్టీలతో కలిసి వివిధ సమస్యలపై ఉద్యమించి, ఆ తరువాత 'తెలంగాణ జన సమితి' పేరిట పార్టీని స్థాపించారు.
'తెలంగాణ జన సమితి' పార్టీ స్థాపించినప్పటి నుంచి కోదండరాం వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు న్నారు. ఎన్నికల్లో ఎలాగైనా తమ పార్టీ సత్తా చూపాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న రాజకీయాల్లో జాతీయ పార్టీలే ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినా తమ పార్టీ మనుగడను కాపాడు కోలేక పోతున్నారు. ఈ తరుణంలో కోదండరాం పార్టీ నెగ్గుకొస్తుందా? అనే సంశయాలు, అనుమానాలు సందేహాలు, ఇతర పార్టీలో వ్యక్తమయ్యాయి.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తన పార్టీకి జవం జీవం పోసుకోవటానికి
కోదండరాంను మొదటి నుంచి తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేసింది చేస్తోంది. టీఆర్ఎస్
పై వ్యతిరేకతఉన్నవారందరినీ కాంగ్రెస్ రకరకాల పదవులపేరుతో గాలం వేస్తోంది. కానీ కోదండరాం
మాత్రం ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీవైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక
ఇటువైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటన పేరు తో పదేపదే మోడీని కలుస్తూ వస్తున్నారు.
కాగా ఇటీవల నిర్వహించిన ప్రగతి నివేదన సభలో అదే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కేసీఆర్ - మోడీల రహస్య ఒప్పందం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ నిన్న
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం కేసీఆర్ పై యుద్ధం ప్రకటించి ఒంటరిగా పోరాడుతామ ని
ప్రకటించేశారు.
ఈ నేపథ్యంలో కోదండంరాం బీజేపీతో కలిసి వచ్చేఎన్నికల్లో పోటీ
చేస్తారని వస్తున్న వార్తలకు బలంచేకూరుతోంది. తెలంగాణలో దాదాపు 30 నుంచి 40 సీట్ల
వరకు తమ పార్టీ జెండా ఎగుర వేస్తుందని ఇప్పటికే పార్టీ అధినేత ప్రకటిస్తున్నారు. ఈ
నేపథ్యంలో అటు టీఆర్ఎస్తో కాకుండా ఇటు కాంగ్రెస్తో కాకుండా బీజేపీతో అయితే కొంచెం
సెంటిమెంట్ వర్క్అవుట్ అవుతుందని భావిస్తున్నారు.
దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు, కాంగ్రెస్ అంటే గిట్టనివారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కోదండరాం సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలు మాత్రమే బరిలో బలంగా ఉన్నాయనుకునే సమయంలో మూడవ రాజకీయ నేతృత్వం "అమిత్ షా బిజెపితో-కొదండరాం టిజేఎస్-పొత్తు" ద్వారా లభిస్తుంది. కోదండరాం పార్టీ ఈ రకంగా ప్రణాళిక రచిస్తే “ముక్కోణపు పోటీ లేదా ట్రయాంగులర్ వార్” జరిగే అవకాశం ఉంది.