పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 'భారత్ బంద్' పిలుపునకు పలు పార్టీలు మద్దతు పలకడంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఈ బంద్ ఎఫెక్ట్ బెంగుళూర్ లో బాగా పడిందనే చెప్పాలి..దాదాపు సిలికాన్ సిటీ బెంగుళూరులో ప్రజా జీవనం స్తంభించినట్లయ్యింది. ఐటీ నగరంలో ఎక్కువ మంది ఆధారపడే బీఎంటీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీఎస్ సహా 21 ప్రధాన విపక్షాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు బంద్లో పాల్గొంటున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. దీంతో సాధారణ ప్రజల రవాణాకు కష్టాలు తప్పవు.
ప్రభుత్వ కార్పొరేషన్లు అయిన బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ, ఎన్డబ్ల్యుకేఆర్టీసీ, ఎన్ఈకేఆర్టీసీ తదితర సంస్థల ఆధ్వర్యంలోని బస్సులు తిరగవు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశాయి. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద తెల్లవారుజామునుంచే విపక్షాలు ఆందోళన చేపట్టాయి.
విశాఖ, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ తదితర ప్రాంతాల్లోనూ బంద్ ప్రభావం కనిపిస్తోంది. తణుకు, ఏలూరు, కడప తదితర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో కాంగ్రెస్, జనసేన, వామపక్ష కార్యకర్తలు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఇతర విపక్షాలు రాజ్ ఘాట్ నుంచి రామ్ లీలా మైదాన్కు మార్చ్ చేసారు. గుజరాత్లో ఆందోళనకారులు బస్సు టైర్లను కాల్చివేసి, ట్రాఫిక్ నిలిపివేసి, వాహనదారులను, ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేసారు. తెలంగాణ, ఏపీలలో బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. విజయవాడలో బంద్లో కాంగ్రెస్, లెఫ్ట్తో పాటు జనసేన పాల్గొంది. జనసేన కూడా బంద్కు మద్దతు పలికింది.