వచ్చే ఎన్నికల్లో ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు సీన్ అర్ధమైపోయినట్లుంది. అందుకే ప్రత్యర్ధులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ప్రత్యర్ధులను ఎలాగైనా సరే భయపెట్టి దారికి తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లే కనబడుతోంది. మైలవరం నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరర్రావుపై కేసు బనాయించారు. ఎప్పుడైతే నాగేశ్వరరావుపై పోలీసులు కేసు పెట్టారో అప్పటి నుండి వైసిపి శ్రేణులంతా దేవినేనిపై మండిపోతున్నారు.
నియోజకవర్గంలో దేవినేనికి గట్టిపట్టున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో గడచిన నాలుగేళ్ళలో మంత్రి వ్యవహారశైలితో చాలా వర్గాలను దూరం చేసుకున్నారు. మంత్రిపై నియోజకరవర్గంలో వ్యతిరేకత పెరిగిపోయింది. అదే సమయంలో వైసిపి సమన్వయకర్తగా అదే సామాజికవర్గంలో గట్టిపట్టున్న వసంత కృష్ణప్రసాద్ ను వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దింపారు. రేపటి ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేయబోయేది కూడా వసంతే. దాంతో నియోజకవర్గంలో సమీకరణలు మారిపోతున్నాయి. దేవినేని అంటే పడని చాలామంది వసంతకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆర్దికంగా కూడా గట్టిస్దితిలో ఉన్న కారణంగా వసంతకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అందునా తండ్రి వసంత నాగేశ్వరరావుకు నియోజకర్గంలో మంచి పేరుతో పాటు పట్టుండటం కృష్ణప్రసాద్ కు బాగా కలసివస్తోంది. దాంతో మంత్రికి చెమటలు మొదలయ్యాయి.
వచ్చే ఎన్నికల్లో వసంతను నేరుగాఆ ఢీ కొనటం కష్టమని భావించిన దేవినేని వసంత నాగేశ్వరరావును ఏదో ఓ రూపంలో ఇబ్బంది పెట్టాలనుకున్నారు. గుంటుపల్లి పంచాయితీలో పంచాయితీ కార్యదర్శి వైసిపి బ్యానర్లను తొలగించారు. దాంతో ఆ విషయం మాట్లాడేందుకు నరసింహారావుకు నాగేశ్వరరావు ఫోన్ చేశారు. ఇంకేముంది ఫోన్ చేసి తనను అమ్మనాబూతులు తిట్టినట్లు నరసింహారావు దగ్గర ఫిర్యాదు తీసుకుని పోలీసులు నాగేశ్వరరావుపై కేసు పెట్టారు. కేసు పెట్టిన పోలీసులు తర్వాతేం చేస్తారన్నది వేరే విషయం. ముందు కేసైతే పెట్టేస్తే వీలువెంబడి ఏమైనా చేయవచ్చని పోలీసుల ఆలోచనగా కనపిస్తోంది. అంటే వసంత కృష్ణప్రసాద్ ను ఏమీ చేయలేక ఆయన తండ్రిపై కేసు పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టాలని దేవినేని ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది.