పాదయాత్ర మొదలైన తర్వాత ఇంత కాలానికి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సుకు హాజరవుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఇప్పటికే పలు సామాజికవర్గాల ఆత్మీయ సదస్సులో జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. సామాజిక వర్గాల సమస్యలపై అధ్యయనం చేస్తున్న జగన్ సదస్సుల్లో ఎక్కడికక్కడ హామీలిస్తున్నారు.
అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలోని సిరిపురంలో సాయంత్రం జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సదస్సులో పాల్గొంటున్నారు. వైసిపిలోని ఏకైక బ్రాహ్మణ సామాజికవర్గం ఎంఎల్ఏ కోన రఘుపతి ఆధర్యంలో ఈ సదస్సు జరుగుతున్నట్లు సమాచారం. సామాజికవర్గాల్లోని ప్రముఖులను ఆకట్టుకోవటం ద్వారా ఆయా సామాజికవవర్గం ఓట్లను సంపాదించుకోవటమే అంతిమ లక్ష్యమనటంలో సందేహం లేదు. జగన్, చంద్రబాబునాయుడు ఎవరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశాలు ఒక విధంగా ఫెయిల్ అవుతున్నాయి.
ఇప్పటికే కాపు, ముస్లిం సామాజికవర్గాలతో సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు త్వరలో బిసి సామాజికవర్గంతో కూడా సమావేశం నిర్వహించేందుకు సిద్ధపడుతున్నారు. అదే సమయంలో జగన్ కూడా సామాజికవర్గాల సమావేశాలతో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. కొంత కాలంగా తిరుమలతో జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు లేదా ఇతర కారణాలూ కావచ్చు బ్రాహ్మణ సామాజికవర్గంపై చంద్రబాబు కత్తికట్టారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో అదే సామాజికవర్గంతో జగన్ సదస్సు నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి మొదలైంది. ఆయా సామాజికవర్గాల సమావేశాల్లో ఇచ్చే హామీలను ఇద్దరిలో ఎవరు నెరవేరుస్తారో ? సామాజికవర్గాలు ఎవరిచ్చే హామీలను నమ్ముతారో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.