అతి వేగం అన్నింటికి అనర్థం అని ఎన్ని సార్లు చెబుతున్నా..కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.
హెచ్సీఐ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి నుంచి కోఠి వెళ్తోంది. ఉదయం 8 గంటల సమయంలో గచ్చిబౌలి చౌరస్తా వద్దకు చేరుకున్న బస్సు మరో బస్సును తప్పించబోయి రోడ్డు దాటుతున్న పాదచారుల పైకి దూసుకెళ్లింది. అంతే ఆ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు.
మృతుల్లో దశరథ్ అనే ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేపట్టారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.