నాలుగువైపుల నుండి పెరుగుతున్న ఒత్తిడి చంద్రబాబునాయుడుపై బాగానే పనిచేసినట్లుంది. పెరిగిపోతున్న పెట్రోలు, డీజల్ పై 2 రూపాయలను తగ్గించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం అందరికీ తెలుసు. పాపాలు పెరిగిపోయినట్లు ఆయిల్ ధరలు పెరుగిపోతుండటంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెరిగిపోతున్నాయి. ఈరోజు కాంగ్రెస్ తదితర 21 పార్టీలు దేశవ్యాప్తంగా బంద్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఏపి వ్యాప్తంగా పెట్రోలు లీటర్ ధర 86 రూపాయలు టచ్ అయ్యింది. జనాల మూడ్ చూసుకునే పెరుగుతున్న పెట్రోలు, డీజల్ ధరలపై చంద్రబాబు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి పై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. కేంద్రంపై ఆరోపణలు, విమర్శలు చేసేందుకు వచ్చే ఏ అవకాశాన్ని చంద్రబాబు వదులుకోవటం లేదు.
ఏపిలో పెట్రోలు లీటర్ 86 రూపాయలకు చేరిందంటే అందులో రాష్ట్రప్రభుత్వ పాపం కూడా ఉంది. కేంద్రం విధిస్తున్న పన్నులకు అదనంగా అమ్మకపు పన్ను, స్ధానిక పన్నుల పేరుతో భారీగానే వడ్డిస్తోంది. అందుకనే ఏడాదికి రాష్ట్రప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 6 వేల కోట్లు చేరుతున్నట్లు సమాచారం. ఎటూ ఎన్నికలు వస్తున్నాయి. జనాల మూడ్ ను చూసుకునే రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న ఒత్తిడి వల్ల పెట్రోలుపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అనేక పన్నుల్లో 2 రూపాయలు తగ్గించుకునేందుకు చంద్రబాబు ఆదేశించారు.