తెలంగాణ లో ఎన్నికలు హడావిడి మొదలవ్వడం తో పొత్తులు గురించి అన్ని పార్టీలు తెగ ఆలోచిస్తున్నాయి. కేసీఆర్ ప్రకటన తర్వాత వ్యవహారం మరింత స్పీడందుకుంది. నిన్న పవన్ కల్యాణ్ స్వయంగా పొత్తు విషయంపై తమ నేతలతో అంతర్గత సమావేశంలో చర్చించారు. రెండు రోజుల్లో సీపీఎం నేతలతో ఆయన సమావేశమవుతారు. అయితే ఈ పొత్తు వల్ల అటు జనసేనకు, ఇటు సీపీఎంకు ఒరిగేదేం లేదు.
ఎన్నికలపై ఈ పొత్తు ఎలాంటి ప్రభావం చూపదు. కానీ ఇక్కడ పవన్ కల్యాణ్ వ్యూహం వేరు. ఆయన చంద్రబాబును దెబ్బకొట్టే లక్ష్యంతో ఈ పొత్తు పెట్టుకుంటున్నారు. అదెలాగంటే తెలంగాణలో సీపీఎంతో జనసేన పొత్తు ఖరారయితే.. కాంగ్రెస్ తో కలసి మహాకూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్న టీడీపీ ఎత్తుగడకు ఎదురుదెబ్బ తగిలినట్టవుతుంది. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు, కోదండరాం జనసమితి తో కలసి టీడీపీ మహాకూటమికి ప్రయత్నాలు చేస్తోంది.
ఇందుకు సీపీఐ కాస్తో కూస్తో సుముఖంగా ఉన్నా.. సీపీఎం మాత్రం ముందు నుంచీ జనసేనతో ప్రయాణం చేయాలనుకుంటోంది. ఏపీలో వామపక్షాలు ఏకపక్షంగా జనసేనకు జై కొడుతుంటే.. తెలంగాణలో మాత్రం పొత్తుల విషయంలో వామపక్షాల మధ్య అభిప్రాయబేధాలున్నాయి. సీపీఎంని అటువైపు అడుగేయకుండా పవన్ అడ్డుకోగలిగితే, పురిటిలోనే మహా కూటమిని చంపేసినట్టు అవుతుంది.