ఎమైఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అనుభవఙ్జుడైన ముఖ్యమంత్రిగా ఉండి ఏపి రాష్ట్రానికి ఏమీ చేయలేని నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్కు అధినేతగా ఉండి ఎలాంటి రాజధాని నిర్మించావో? ముందు చూసుకో చంద్రబాబు! మీ రాజధానిలో గట్టిగా వర్షం కురిస్తేనే మీ ఆఫీసు లోకే (సెక్రటేరియట్) నీళ్లు వస్తున్నాయి అని బాబుని ఓవైసీ ఎద్దేవా చేశారు.
అసలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో పోత్తు పెట్టుకోవటం లోని ఔచిత్యాన్ని, టీడీపీ పవిత్రతను, నిజాయతీ ని ప్రశ్నించారు. అది పొత్తు ఎలా ఔతుంది? తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? అని అసదుద్దీన్ మండిపడ్డారు. ఏపీలో కాస్తో కూస్తో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీడీపీతో పొత్తు వల్ల అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, తెలంగాణలో నిండా మునుగుతుందని అన్నారు.
చంద్ర బాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన అసదుద్దీన్ ఒవైసీ, నాలుగేళ్లు కేంద్రంలో బీజేపీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని
అన్నారు. కాని ఇదే చంద్రబాబు 2019 ఎన్నికల తర్వాత టీడీపీని మళ్లీ బీజేపీ తో కలిపెయ్యటం ఖాయం అని కూడా అసదుద్దీన్ జోస్యం చెప్పారు.
ముస్లింలపై దాడులు జరిగినప్పుడు చంద్రబాబు మర్యాదకైనా నోరుకూడా విప్పలేదు, కాని ఎన్నికల సమయంలో ముస్లింల మీద ప్రేమ కురిపిస్తే ముస్లిం అనే వారెవరూ ఆయన్ని నమ్మబోరని చెప్పారు. కాంగ్రెస్ తో కలిసొచ్చినా, ఒక్కరే వచ్చినా, తెలంగాణాలో నాయుడు గారు పెద్దగా చేసేదేమీ ఉండదు, జీరోకావడం తప్ప అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉద్ఘాటించారు.
టీడీపీ - కాంగ్రెస్ పార్టీల పొత్తును తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణా ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారన్నారు. అలాంటి అపవిత్ర పొత్తుతో కాంగ్రెస్, టీడీపీ రెండు కూడా నిండా మునుగుతాయి అన్నారు. ‘నేను చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా! నీవు, నీ కొడుకు కలసి హైదరాబాద్లో పోటీ చేయండి. మేం కూడా పోరాడుతాం. ఎవరి శక్తి ఏమిటో తేలిపోతుంది. టీడీపీకి మిగిలిన కొంత బలం కూడా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది" అని, టీఆర్ఎస్, ఎంఐఎం ను ఒంటరిగా ఢీ కొనే దమ్ములేకే టీడీపీ, కాంగ్రెస్ లు పొత్తుల కోసం పాకులాడుతున్నాయి అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
టీఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు ఎలాంటి వివక్ష లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. సెటిలర్లు.. ఆంధ్రావాళ్లు అని ఎవరైనా అంటున్నారా? తెలంగాణ ప్రజలుగానే చూశారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. పౌరుల్లో అభద్రత లేదు. మత కలహాలు అసలే లేవు. ఇంకా ఏం కావాలి? టీఆర్ఎస్ ఇంకా అభివృద్ధి చేయాల్సింది అని చెప్పగలుగుతామే తప్ప, ఎలాంటి లోటూ లేదు’ అని అసదుద్దీన్ అన్నారు.
కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశమే లేదు. టీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీతోమళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతార ని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. మేం కొన్ని చోట్ల టీఆర్ఎస్ తో కూడా కొట్లాడుతాం!" అని అసదుద్దీన్ ఓవైసీ ఉద్ఘాటించారు.