కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఖరేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఆయన ఎప్పుడేమి మాట్లాడుతారో ఆయనకే తెలుస్తున్నట్లు లేదు. కాపులకు బిసి రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు నాటకాలు ఆడినట్లు అందరు మండిపడుతుంటే ముద్రగడకు మాత్రం చంద్రబాబుపై అపారమైన విశ్వాసమే ఉన్నట్లుంది. చంద్రబాబును ఉద్దేశించి తాజాగా ముద్రగడ రాసిన లేఖ అదే విషయాన్ని సూచిస్తోంది.
రాష్ట్ర అసెంబ్లీలో కాపులకు బిసిల రిజర్వేషన్లపై చేసిన తీర్మానంతో పాటు కేంద్రానికి పంపిన రిజర్వేషన్ బిల్లును వాపసు తీసుకోవాలని చంద్రబాబుకు ముద్రగడ సూచించటం విచిత్రంగా ఉంది. ఆమధ్య కేంద్రానికి పంపిన బిల్లులో అవసరమైన సవరణలు చేసి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మళ్ళీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలంటూ సూచించారు. సవరణ చేసిన బిల్లును గవర్నర్ ఆమోదం తీసుకుని చట్టం చేయాలని చెబుతున్నారు. కాపు జాతికి బిసి ఎఫ్ సర్టిఫికేట్లు ఇచ్చేట్లుగా ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అసరమైతే తానే కాపు రిజర్వేషన్ల బిల్లును తయారు చేయిస్తాననే బంపర్ ఆఫర్ ఇవ్వటం విడ్డూరంగా ఉంది.
ఇతంతా చూస్తుంటే ముద్రగడ వైఖరిపైనే అందరిలోనూ అనుమానాలు వస్తున్నాయి. అప్పట్లో చంద్రబాబు అసెంబ్లీలో చేయించిన తీర్మానమే చెల్లదని, కేంద్రానికి పంపిన బిల్లును కేంద్రప్రభుత్వం తిప్పి పంపేసిందని అందరూ అంటుంటే ఆ విషయాలు ముద్రగడకు పట్టటం లేదు. పైగా కొత్తగా సవరణలు చేసి బిల్లును తయారు చేసి గవర్నర్ ఆమోదంతో చట్టం చేయాలట. చట్టం చేయటం చంద్రబాబు చేతిలో ఉంటే ఆ పని ఎప్పుడో చేశావారు. రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది కాబట్టే చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించలేక ఇచ్చిన హామీ అమలు చేయలేక డ్రామాలాడుతున్నారు. పైగా కాపులకు బిసి ఎఫ్ సర్టిఫికేట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంఆర్ఓలు జారీ చేసే సర్టిఫికేట్లు ఎలా చెల్లుబాటవుతాయని ముద్రగడ అనుకంటున్నారో అర్ధం కావటం లేదు.