ఈ రోజు ఉదయం జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొదట ఇరవై మంది అనుకున్నా..మృతుల సంఖ్య పెరుగుతూ..51 చేరింది. తాజాగా ఈ ప్రమాదం గురించి తెలిసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాటలకు అందని విషాదం. గుండెలు పిండేసే హృదయవిదారక సంఘటన. జగిత్యాల లోని కొండగట్టు ప్రాంతానికి తాను వచ్చానని..అక్కడి ప్రజలకు తానంటే ఎంతో అభిమానమని..ఇలాంటి దుర్ఘటన వార్త విని మనసు తల్లడిల్లి పోయిందని అన్నారు.
కాగా, తెలంగాణలోని కొండగట్టు ఘాట్ రోడ్ బస్సు ప్రమాదంలో 50 మంది వరకు మృతి చెందారని, మరో పదిమంది గాయపడ్డారని తెలిసిందే. కొద్ది క్షణాల్లో మృత్యువు పొంచి ఉందని తెలియని ఆ అమాయక ప్రయాణికులను తలచుకుంటే మనసు ద్రవించిపోతోంది. ఆర్టీసీ బస్సులు ప్రజలకు సురక్షితమైన ప్రయాణం అని ప్రయాణిస్తుంటారు..అలాంటపుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వారిని గమ్య స్థానానికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు.
నిండు ప్రయాణికులతో వెళుతున్న ఈ బస్సు లోయలోకి పడిపోవడం దురదృష్టకరం. చనిపోయినవారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాల వారికి సంతాపం తెలుపుతున్నాను. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి ఎక్స్ క్రేషియా ఇవ్వాలని..గాయపడిన వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ తెలిపారు.