ఇపుడందరిలోనూ ఇదే అనుమానం మొదలైంది. పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించినపుడు లభించిన ఆధరణ ఒక ఎత్తు. మొన్న విశాఖ నగరంలోని కంచెరపాలెం బహిరంగసభకు హాజరైన జనాలు ఒక ఎత్తు. ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఇంత వరకూ ఏ బహిరంగసభకు కూడా అంత జనం రాలేదని ఇంటెలిజెన్స్ నివేదికలే చెబుతున్నాయి.
టిడిపి నేతల్లో మొదలైన కలవరం
మామూలుగా అయితే ప్రతిపక్షాలు నిర్వహించే బహిరంగసభకు ఎంత జనాలు వచ్చినా పెద్దగా రాలేదనే ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వటం మామూలు. మొన్నటి కంచెరపాలెం సభ నిజంగానే జన సునామిని తలపించింది. కిలోమీటర్ల దూరం వరకూ జనాలతో విశాఖపట్నం నగరం ఫ్రీజ్ అయిపోయింది. అడుగుతీసి అడుగు వేయాలంటేనే ఇబ్బందైందట. మరి అంతటి జనాలను చూసిన తర్వాత అధికార టిడిపి నేతల్లో కలవరం మొదలవ్వటం సహజమే కదా ? అందుకే బహిరంగసభ పూర్తవ్వగానే చంద్రబాబు పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు స్ధానిక నేతలతో సభ గురించి ప్రత్యేకంగా మాట్లాడారట.
జనాలెందుకు అంతగా స్పందిస్తున్నారు ?
వర్షాన్ని, ఎండను కూడా లెక్క చేయకుండా బహిరంగసభ వేదిక వద్దకు జగన్ వచ్చే ముందే చేరుకున్న జనాలు సభ అయిపోయిన జగన్ వేదిక దిగే వరకూ కదలకుండా అక్కడే ఉండిపోయారంటేనే జగన్ విషయంలో జనాలు ఎంత సానుకూలంగా స్పందిస్తున్నారో తెలిసిపోతోంది. ఇంతమంది జనాలు ప్రతిపక్ష నేత విషయంలో ఎందుకంత సానుకూలంగా స్పందిస్తున్నారు ? చంద్రబాబునాయుడు చెప్పుకుంటున్నట్లు జనాల్లో ప్రభుత్వంపై 80 శాతం సంతృప్తి అంతా ఉత్తదేనా ? అన్న అనుమానం అందరిలోనూ మొదలైంది. బహిరంగ సభకు జనాలు రావటం వేరు ఎన్నికల్లో ఓట్లు వేయటం వేరనుకోండి అది వేరే సంగతి.
విజయమ్మ ఓడిపోవటం పెద్ద దెబ్బే
మరి ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా వైసిపిని ఏ మేరకు ఆధరిస్తుంది ? పోయిన ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి గెలిచింది మూడు సీట్లు మాత్రమే. అరకు లోక్ సభ గెలుచుకోగా విశాఖపట్నం ఎంపి స్ధానంలో ఓడిపోయింది. విశాఖలో ఓడిపోయింది ఎవరో కూడా కాదు. స్వయంగా జగన్ తల్లి విజయమ్మే. ఓడిపోయింది లక్ష ఓట్ల తేడాతోనే అయినా జగన్ తల్లే ఓడిపోవటం పార్టీపై పెద్ద దెబ్బే పడింది.
ఉత్తరాంధ్రలో మెజారిటీ ఖాయమేనా ?
ఎందుకంటే, వైఎస్సార్ కుటుంబంలో ఎన్నిక ఏదైనా ఇంత వరకూ ఓడినవారే లేరు. అటువంటిది స్వయానా వైఎస్ సతీమణి ఓడిపోవటం అంటే మామూలు విషయం కాదు. ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆ విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తుండటం గమనార్హం. మొన్నటి జనసునామిని చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ ఫలితం అంచనాలపై మళ్ళీ చర్చ మొదలైంది. ఈసారి ఎన్నికల్లో జిల్లాలో వైసిపికి తిరుగుండదనే చర్చ ఊపందుకుంది. నిజంగానే విశాఖపట్నం వైసిపిని అధరిస్తే ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీలు, నాలుగు ఎంపి స్ధానాల్లో వైసిపి మంచి ఫలితాన్ని రాబట్టుకుంటుందనటంలో సందేహం లేదు.