జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్ లో జరిగిన బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతానికి మృతుల సంఖ్య 58 కి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ బస్సు నడిపి డ్రైవర్ శ్రీనివాస్ నిర్లక్ష్యంపై ఆరోపణలు వస్తున్న వేళ.. ఆయనకు సంబంధించి ఆసక్తికర విషయం తెలిసింది. డ్రైవర్ మద్యం మత్తులో బస్ నడిపారని, నిర్లక్ష్యం, అనుభవలేమి, అతివేగం కారణంగానే బస్సు లోయలో పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే.. అలాంటిదేమీ లేదని, శ్రీనివాస్కు డ్రైవింగ్లో మంచి అనుభవం ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ ఆరోపణలు కుటుంబ సభ్యులు ఖండించారు. శ్రీనివాస్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఉత్తమ డ్రైవర్’ అవార్డును అందుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాస్ కూడా మరణించారు. ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి తీవ్రంగా గాయపడిన ఆయణ్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.
ఇదిలా ఉంటే.. ఈ దుర్ఘటన ఆర్టీసీ చరిత్రలోనే చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకూ 56 మంది మరణించారు. మృతుల్లో మహిళలే ఎక్కువగా (25 మంది) ఉన్నారు. ఇక కండక్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ బస్సులో కొందరు ప్రయాణికులు డ్రైవర్ వైపు ఒరగడం వల్లే అదుపు తప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం.