ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఢిల్లీ పరిణామాలు తెలిసేది ముందుగా ముఖ్యమంత్రికే. అలా కాదని ముఖ్యమంత్రికన్నా ముందుగా ఢిల్లీ సమాచారం ప్రధాన ప్రతిపక్ష నేతకు తెలుస్తోందంటే ఏమటిర్ధం ? చాలా సింపుల్, ఆ సిఎం అసమర్ధుడనే. అందులోను ఆ విషయాన్ని స్వయంగా సిఎం కొడుకే ఒప్పుకుంటే ? ఇంక చెప్పాల్సిన పనేలేదు. తాజాగా ఏపిలో జరిగిందదే. అమరావతిలో నారా లోకేష్ మాట్లాడుతూ, ఢిల్లీ పరిణామాలు చంద్రబాబునాయుడుకన్నా ముందుగా వైసిపి నేత జగన్ కు ఎలా తెలుస్తున్నాయంటూ చాలా అమయాకంగా ప్రశ్నించారు. జగన్-బిజెపిల మధ్య హాట్ లైన్ ఏమన్నా ఉందా అంటూ ప్రశ్నించిన లోకేష్ తన తండ్రి చేతకాని తనాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నట్లైంది.
చురుకు పుట్టించటం కోసమే
ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖపట్నం నగరంలో జగన్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీలు, కీలక నేతలతో సమావేశం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఏపిలో జనవరిలోగానే ఎన్నికలు వచ్చే సూచనలు అందినట్లు చెప్పారు. కాబట్టి నేతలందరూ అప్రమత్తంగా ఉండి బూత్ లెవల్లో కూడా నేతలు అప్రమత్తంగా ఉండి ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోయిన ఎన్నికల్లో చేసిన తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడమన్నారు. నేతలందరూ జనాల్లోనే ఉండాలంటూ ఆదేశించారు.
ఎవరైనా చేసేదదే
ఇక్కడ జగన్ చెప్పిందాంట్లో తప్పేమీలేదు. ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా చేసేదదే. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన దగ్గర నుండి చంద్రబాబు కూడా ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని నేతలను ఎన్నోసార్లు హెచ్చరించారు. ఇపుడు పెడుతున్న బహిరంగ సభలన్నీ ఎన్నికల సన్నాహాల్లో భాగమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
జగన్-బిజెపి మధ్య హాట్ లైనట
విశాఖలో జగన్ చెప్పిన మాటలను పట్టుకుని లోకేష్ అమరావతిలో మాట్లాడుతూ, ఏపిలో ముందస్తు ఎన్నికలొస్తాయని జగన్ కు ఎవరు చెప్పారు ? అంటూ ఎగతాళి చేయటం విచిత్రంగా ఉంది. జగన్ -బిజెపికి మధ్య ఏమన్నా హాట్ లైన్ ఉందా ? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియని చాలా విషయాలు ముందుగా జగన్ కు తెలుస్తున్నాయంటే అక్రమ సంబంధమే కారణమంటూ ఎద్దేవా చేయటం ఆశ్చర్యంగా ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా ఢిల్లీలో ఏం జరుగుతోందో తెలియలేదంటే అది చంద్రబాబు అసమర్ధత క్రిందే లెక్క. అంతేకాని జగన్-బిజెపిల మధ్య హట్ లైన్ ఉన్నట్లు లెక్కేనా ?