ఒక్క నిర్ణయంతో జనసేనాని పవన్ కళ్యాణ్.. విపక్షాలు సహా వివిధ వర్గాలకు సమాధానం చెప్పారు. నిన్న మొన్నటి వరకు పవన్పై అనేక అపోహలున్నాయి. ఆయన ఇంకా కేడర్ ఏర్పాటు చేయలేదని, ఎవరికి టికెట్ ఇస్తాడో కూడా తెలియదని, తన కాపు సమాజానికే ఎక్కువ విలువ ఇస్తాడని ఇలా అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే, అనూహ్యంగా పవన్ తీసుకున్న నిర్ణయం ఆయన వైపు చూపిస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఎవరూ ఊహించని విధంగా వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడి వరం అసెంబ్లీ నియోజకవర్గం.. జనసేన అభ్యర్ధిగా పితాని బాలకృష్ణను ఎంపిక చేశారు.
అయితే, దీనిని ముందుగా ఎక్కడా లీక్ అవకుండా చాలా గోప్యంగా వ్యవహరించారు పవన్. అంతేకాదు, ఇటీవల కాలంలో తనపై వస్తున్న అనేక ఆరోపణలకు ఎక్కడా ఫైర్ అవకుండానే తన పనితాను కానిచ్చేశారు. నిజానికి ఇలాంటి పరిణామా న్ని ఎవ్వరూ ఊహించలేదు. పవన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను కుల రాజకీయాలను ప్రోత్సహించడం లేదని చెప్పకనే చెప్పారు. అదేసమయంలో పార్టీకి అండగా నిలబడే వారికి విద్యావంతులకు ప్రముఖ స్థానం కల్పిస్తానని అభ్యర్థి ఎంపిక ద్వారా నిరూపించుకున్నారు. .పవన్ కళ్యాణ్ తండ్రి కానిస్టేబుల్ గా ఒకప్పుడు పనిచేశారు. ఇప్పుడు అదే రంగంలో ఉన్న వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం ద్వారా తాను కుటుంబ సభ్యులకు ఇస్తున్న విలువను సైతం ఆయన వెల్లడించారు.
ఇక, వైసీపీతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు పవన్ సంసిద్ధుడయ్యాడంటూ.. టీడీపీనేతలు చేస్తున్న ప్రచారానికి సైతం ఆయన చెక్ చెప్పారు. తాను పార్టీ పెట్టింది స్వతంత్రంగా ఎదిగేందుకేనని వెల్లడించారు. అందుకే వైసీపీ నుంచి వచ్చిన నాయకుడు బాలకృష్ణకు కండువా కప్పారు.దీనిని బట్టి ఇతర పార్టీల్లో గుర్తింపు లభించని వారికి తాను అవకాశం ఇస్తాననే ఉద్దేశంతో పవన్ వ్యవహరించినట్టు కాదు. అయినా.. విద్యావంతులు, ప్రజల కోసం పనిచేసేవారు ఎక్కడ ఉన్నా.. తాను పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమేనని ప్రకటించడంలోనే ఈ గోప్యత పాటించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. తన సొంత జిల్లాలో తన తండ్రి వృత్తి నుంచి వచ్చిన వ్యక్తికి అభ్యర్థిత్వం ప్రకటించడం పవన్ వ్యూహాత్మక నిర్నయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.