జనసేనాని పవన్ కళ్యాణ్.. చేస్తున్న రాజకీయాలపై మేధావులు సైతం పెదవి విరుస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పవన్ ను సపోర్టు చేసిన మేధావులే.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఇవేం రాజకీయాలు పవన్! అంటూ ఎత్తిపొడుస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నవారికి వ్యూహాలు ఉండాలి కానీ.. వాటిని ప్రజలు నమ్మేలా ఉండాలని, కానీ, పవన్ వ్యవహార శైలి చూస్తే.. వీటికి భిన్నంగా ఉందని అంటున్నారు. కొంతసేపు తాను ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెబుతాడు. మరికొంత సేపు తనకు వైసీపీ అధినేత జగన్ మాదిరిగా ఆశలేదని అంటాడు.. ఇలా కన్ఫ్యూజ్ రాజకీయాలు చేస్తే.. ఎలా అనేది మేధావుల మాట. తాను ప్రజల తరఫున ప్రశ్నించేందుకు మాత్రమే వచ్చానని మొదట్లో చెప్పుకొచ్చారు పవన్.
అదేసమయంలో సీఎం పదవికోసం అనుభవం కావాలని ఉద్బోధించారు. ఇంతలోనే చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. తాను సీఎం కావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు తాజాగా ఆయన సీఎం పదవి వేస్ట్ అని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుడికి దేనిమీదా ఆశ ఉండకూడదని వ్యాఖ్యానించారు. నా ఆశ ఆశయం మీద ఉంది.. సీఎం పదవిపై కాదు.. సీఎం ఆకాంక్షతో రాజకీయాల్లోకి వస్తే.. వేరుగా ఉండేది చెప్పడంతో మేధావులు సైతం నాలుక కరుచుకున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో వచ్చేది.. పార్టీలు పెట్టేదీ పదవులు అధికారం కోసమే అనే విషయం తెలియందికాదు. కానీ, దీనికి భిన్నంగా పవన్ వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే, అనూహ్యంగా ఆయన మళ్లీ సీఎం అవుతానని, తనను సీఎం చేయాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పుకొచ్చారు. ఇంతలోనే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ విషయంలో తనకు అంత ఆసక్తి లేదని చెప్పడం ద్వారా తాను కన్ఫ్యూజ్లో ఉన్నాడా? లేక ప్రజలను కన్ఫ్యూజ్లోకి నెడుతున్నాడా? అనేది ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు మేదావులు.
ఇక, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని లారీ టైర్లతో చెప్పులు కుట్టించుకున్న మహానుభానుడు బీఎస్పీ అధ్యక్షుడు కాన్షీరాం తనకు ఆదర్శమని చెప్పారు. కానీ, ఆయన చేసే ప్రతి పనిలోనూ రూ.కోట్ల ఖర్చు కనిపిస్తూనే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక, పార్టీ కోసం విరాళాలను అడగడం లేదని.. ఎవరైనా వాళ్ల ఇష్టంతోనే ఇవ్వాలని చెప్పడం ద్వారా సెంటిమెంట్ రాజకీయాలకు తెరదీశారా? అనే సందేహం వస్తోంది. ఏదేమైనా ఎన్నికల ముంగిట పవన్ ఇలా చేస్తే.. కష్టం బాస్ అనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.