రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగిపోతున్నా పార్టీల మధ్య పొత్తులు, ఎవరెవరి మధ్య పొత్తన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇంకా రాలేదు. ఇప్పటి వరకూ కనబడుతున్న సమాచారం ప్రకారం తెలంగాణా రాష్ట్ర సమితి అయితే ఒంటరే. కాకపోతే ఎంఐఎం మిత్రపక్షం మాత్రమే. అదే విధంగా కాంగ్రెస్, టిడిపి, సిపిఐ మహాకూటమిగా ఏర్పడినట్లు స్వయంగా టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణి, కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డే ప్రకటించారు. వీరిమధ్య పొత్తు కుదిరినప్పటి నుండి కెసిఆర్ లో ఆందోళన స్పష్టంగా బయటపడుతోంది.
బిజెపికి అంత సీన్ ఉందా ?
ఇక, భారతీయ జనతా పార్టీది కూడా ఒంటరి పోటీనే అనుకోవాలి. కాకపోతే అసలు బిజెపి బలమెంతన్నదే అందరిలోనూ మొదలైన అనుమానం. పోయిన ఎన్నికల వరకూ బిజెపికున్న బలమేంటో అందరికీ తెలిసిందే. అయితే, ఇపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా కమలనాబులు వాపును చూసి బలమనుకుంటున్న విషయం అర్ధమైపోతోంది. కాబట్టి ఒంటరిగా పోటీ చేయటానికి రెడీ అవుతున్న బిజెపికి ఇపుడున్న నలుగురు ఎంఎల్ఏల బలమైనా ఉంటుందా అన్నదే సందేహం.
వైసిపి, జనసేనలు ఉనికిలో ఉన్నాయా ?
ఇక, సిపిఎం సంగతి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. ఆ పార్టీ కూడా ఏదో ఒక పెద్ద పార్టీకి తోకపార్టీ లాగ తయారైపోయింది. కాకపోతే ఇపుడు తోకపార్టీగా మారటానికి సిపిఎంకు పెద్ద పార్టీనే ఇంకా దొరకలేదు. చివరగా మిగిలింది వైసిపి, జనసేనలు మాత్రమే. ఈ రెండు పార్టీలకు తెలంగాణాలో ఉన్న బలమెంతో ఎవరికీ కచ్చితమైన అంచనాల్లేవు. ఎందుకంటే, రెండు పార్టీలకు ఉనికి కూడా దాదాపు లేవనే చెప్పాలి.
రెండు పార్టీలూ గట్టివే
కాబట్టి క్షేత్రస్ధాయి సమాచారం ప్రకారం పోటీ టిఆర్ఎస్-కాంగ్రెస్, టిడిపి మధ్యనే అనుకోవాలి. ఎందుకంటే, ఈ రెండు పార్టీలకు క్షేత్రస్ధాయిలో మంచి బేస్ ఉంది. ఓటర్లలో రెండు పార్టీలకు స్దిరమైన ఓటుబ్యాంకు కూడా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. టిడిపి నుండి చాలా మంది నేతలు వెళ్ళిపోయినా క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. టిడిపిని వదిలేసిన నేతల్లో రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సీతక్క లాంటి నేతలు కాంగ్రెస్ లో చేరారు. నేతలు లేకపోయినా ఓటుబ్యాంకు దృష్ట్యా టిడిపి బలంగానే కనిపిస్తోంది.
ఓటు ట్రాన్స్ ఫర్ జరిగితే టిఆర్ఎస్ కు కష్టమేనా ?
అదే సమయంలో కాంగ్రెస్ నేతలు, క్యాడర్ రీత్యా బలంగానే కనిపిస్తోంది. వీళ్ళకు టిడిపి నుండి వచ్చేసిన నేతలు తోడవ్వటంతో క్షేత్రస్ధాయిలో మునుపటికన్నా బలంగానే ఉంది. ఈరెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగి ఓటు ట్రాన్స్ ఫర్ సరిగ్గా జరిగితే టిఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవు. కెసిఆర్ కూడా ఆ విషయంపైనే భయపడుతున్నట్లు కనబడుతోంది. అందుకే వరుసపెట్టి కాంగ్రెస్ నేతల అరెస్టులు, కేసులు, నోటీసులు.