మహారాష్ట్రలోని ధర్మాబాద్ న్యాయస్ధానం చంద్రబాబునాయుడుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయటంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వారెంట్ జారీ పై రాజకీయాల్లో రెండు రకాల కుట్రలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. మొదటిది భారతీయ జనతా పార్టీ నేతలు, తెలంగాణా ఆపద్దర్మ సిఎం కెసిఆర్ కలిసి చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రపన్ని వారెంటు జారీ చేయించారన్నది మొదటి కుట్రట.
చంద్రబాబుకు వ్యతిరేకంగా కెసిఆర్ ప్లాన్
తెలంగాణాలో ముందస్తు ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపధ్యంలో చంద్రబాబు ఇబ్బందికర పరిస్ధితుల్లో పడ్డారు. తెలంగాణా ఎన్నికల్లో కెసిఆర్ కు వ్యతిరేకంగా ధైర్యంగా ప్రచారం చేయలేకపోతున్నారు. అలాగని ప్రచారం చేయకపోతే దాని ప్రభావం ఏపి పైన కూడా పడుతుందన్న ఆందోళన. అదే సమయంలో తెలంగాణాలో స్వేచ్చగా చంద్రబాబును తిరిగనివ్వకుండా చేయాలన్నది కెసిఆర్ ప్లాన్ గా చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి అరెస్టు, గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు, రేవంత్ రెడ్డికి నోటీసులు ఇందులో కెసిఆర్ కుట్రలో భాగమే అంటున్నారు. అందుకు మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వంతో కలిసి ఇపుడు ఏకంగా చంద్రబాబు మీదే అరెస్టు వారెంటు జారీ చేయించారనేది ఓ వర్షన్.
శివాజి చెప్పిన నోటీసులేంటి ?
ఇక, రెండో కుట్ర ప్రచారం గురించి చూద్దాం. ఆమధ్య సినీ నటుడు శివాజి మాట్లాడుతూ ఆపరేషన్ గరుడ అనే పేరుతో చంద్రబాబుకు త్వరలో నోటీసులు జారీ అవ్వబోతున్నట్లు చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్దలు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శివాజి ఎంతైనా చంద్రబాబు మనిషే. కోర్టు నుండి చంద్రబాబుకు వారెంటు రావటం యాధృచ్చికమో లేకపోతే తెరవెనుక జరిగిన ప్లానింగ్ లో భాగమో కూడా తెలీదు. కోర్టు నుండి తనకు నోటీసులు ఇప్పించుకుని జనాల నుండి సంపథీ కొట్టేయాలన్నది చంద్రబాబు ప్లాన్లో భాగమే అనేది రెండో కుట్రగా ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబుకు నోటీసులిచ్చే వ్యవస్ధ ఉందా ?
ఎందుకంటే, చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే వ్యవస్ధ ఏదీ దేశంలోనే లేదన్నది రెండో కుట్రగా అనుమానం వ్యక్తం చేస్తున్న వారి వాదన. ఒకపుడు చంద్రబాబు అవినీతి మీద విచారణ జరిపించాలని వైఎస్ విజయమ్మ కోర్టులో కేసు వేస్తే దర్యాప్తు చేయటానికి తగినంత సిబ్బంది లేరని సమాధానం చెప్పిన ఘనచరిత్ర సిబిఐకుంది. అలాగే, తనపై విచారణ జరగకుండా 16 కేసుల్లో స్టేలతో దశాబ్దాల పాటు కంటిన్యు అవుతున్న ఘనుడు చంద్రబాబు.
మాడియానే అసలైన మద్దతు
ప్రస్తుతం ఏకకాలంలో చంద్రబాబు అటు కెసిఆర్ ఇటు మోడిపైన యుద్ధం చేస్తున్నట్లు నటిస్తున్నారు. నిజానికి ఇద్దిరితో కాదు, అసలు ఎవ్వరితోను నేరుగా యుద్దం చేసేంత సీన్ చంద్రబాబుకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. తన శతృవులపై తనకు మద్దతుగా నిలబడే మీడియా ద్వారా బురద చల్లించటం మాత్రమే చంద్రబాబుకు తెలిసిన విద్య. ఆ విద్యతోనే చంద్రబాబు తన ప్రత్యర్ధులను ఇబ్బంది పెడుతుండటం దశాబ్దాలుగా అందరూ చూస్తున్నదే. కాబట్టి జనాల సంపథీ కోసం చంద్రబాబే తనకు తాను నోటీసులు వచ్చేట్లుగా చేసుకున్నారన్నది రెండో కుట్ర ప్రచారాన్ని తేలిగ్గా తీసుకునేందుకు లేదు. మరి పై రెండు కుట్ర ప్రచారాల్లో ఏది నిజమో కాలమే తేల్చాలి.