అవును ఆ సామాజికవర్గం ఓట్ల కోసం చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా పోటీ పడుతున్నారు. పోయిన ఎన్నికల అనుభవాలను దృష్టిలొ పెట్టుకుని ఇద్దరూ ఒకే సామాజికవర్గం మద్దతు కోసం ఈ స్ధాయిలో పోటీ పడటం ఎన్నడూ జరగలేదు. ముస్లిం సామాజికవర్గం మద్దతు కోసం చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. అందులో భాగంగానే పోయిన నెలలో నారా హమారా-టిడిపి హమారా అంటూ ఓ సభ కూడా నిర్వహించారు. తాజాగా విశాఖపట్నం పాదయాత్రలో ఉన్న జగన్ కూడా ముస్లింల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంటే ఒకే సామాజికవర్గం మద్దతు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారన్న మాట.
పోయిన ఎన్నికల్లో గుండుగుత్తగా మైనారిటీలు వైసిపిని ఆదరించారు. అందుకనే వైసిపి తరపున ఏకంగా నలుగురు అభ్యర్ధులు గెలిచారు. సరే, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అందులో ఇద్దు ఎంఎల్ఏలు పార్టీ ఫిరాయించరనుకోండి అది వేరే సంగతి. అదే సమయంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ముస్లింలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దాంతో ముస్లింలు చంద్రబాబంటే మండిపోతున్నారు. ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేయగానే వెంటనే ముస్లింలు గుర్తుకు వచ్చారు. ఇంకేముంది తానే ముస్లింలను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. పోయిన ఎన్నికల్లో ముస్లింల కోసం చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు కాలేదు.
ఇక, జగన్ విషయానికి వస్తే మొదటి నుండి వైసిపిలో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తునే ఉన్నారు. ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో వారి మద్దతును మరింత పెంచుకునేందుకు జగన్ కూడా ముస్లిం సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చంద్రబాబు హామీలను గుర్తు చేస్తు మోసం చేసిన వైనాన్ని వివరించారు. హక్కులను, ఇచ్చిన హామీలను గుర్తు చేసిన ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు బనాయించిన విషయాన్ని గుర్తు చేశారు. సరే, సమ్మేళనమన్న తర్వాత వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఏమి చేయబోతున్నారో హామీలు కూడా ఇచ్చారు లేండి. ఈ విధంగా తమ మద్దతు కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతల్లో ముస్లింలు ఎవరికి మద్దతుగా నిలబడుతారో చూడాల్సిందే.