తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆ మాజీ ఎంపీలు అసెంబ్లీ సీట్లపై కన్నేశారు. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీ సీట్లు సంపాదించి, గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. యథావిధిగా మళ్లీ లోక్సభ ఎన్నికల బరిలో ఉండవచ్చుననే ప్లాన్ వేస్తున్నారు. ఈ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా మానుకోట మాజీ ఎంపీ బలరాం నాయక్ ఈసారి మానుకోట అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకే టికెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం మాజీ ఎంపీ, ఫైర్బ్రాండ్గా గుర్తింపు పొందిన రేణుకాచౌదరి ఈసారి గ్రేటర్ హైదరాబాద్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఏదో ఒక అసెంబ్లీ సీటుకోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పార్టీ అధిష్ఠానం కూడా సానుకూలంగా ఉండడం గమనార్హం.
అలాగే.. గ్రేటర్ హైదరాబాద్లోని మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో వరంగల్ లోక్సభ నుంచి బరిలోకి దిగిన సర్వే సత్యనారాయణ కూడా అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి అంశం మళ్లీ తెరపైకి వచ్చిన పక్షంలో ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కంటోన్మెంట్ (ఎస్సీ) సీటు ఆశిస్తున్నారు. అయితే.. ఈసీటను అల్లుడు క్రిశాంక్కు ఇస్తారనే టాక్ వినిపిస్తున్నా.. తాజాగా సర్వే పేరు అనూహ్యంగా తెరపైకి రావడం గమనార్హం. గత ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్రెడ్డి కూడా రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు.
ఇక ఉమ్మడి నల్లగొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరులది ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానమే. రాజగోపాల్రెడ్డి కూడా మునుగోడు అసెంబ్లీ స్థానంపై పట్టుపడుతున్నారు. గత ఎన్నికల్లో భువనగిరి లోక్సభకు పోటీచేసి ఓడిపోయారు. అయితే... ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి మునుగోడు అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఈసారి కరీనంగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను లోక్సభకే పోటీ చేస్తానని చెబుతున్నా.. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మాత్రం అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఉంటానని అంటున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జహీరాబాద్ లోక్సభ నుంచి బరిలో ఉన్న సురేశ్షెట్కార్ ఈసారి నారాయణ్ఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎంతమందికి టికెట్లు వస్తాయో చూడాలి మరి.