తాజా తిరుపతి పర్యటనలో చంద్రబాబునాయుడుకు సొంతపార్టీ ఎంఎల్ఏనే షాక్ ఇచ్చారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో అందరూ చంద్రబాబు దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తుంటే ఎంఎల్ఏ మాత్రం సిఎం పర్యటనకే దూరంగా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనార్ధం చంద్రబాబు తిరుమలకు చేరుకున్నారు. మంత్రి అమరనాధ్ రెడ్డితో సహా జిల్లా నలుమూలల నుండి టిడిపి ఎంఎల్ఏలు, నేతలు హాజరయ్యారు. అయితే, తిరుపతి ఎంఎల్ఏ సుగుణమ్మ మాత్రం గైర్హాజరయ్యారు. తిరుపతి, తిరుమల పర్యటనలో ఉండాల్సిన లోకల్ ఎంఎల్ఏనే లేకపోవటం చంద్రబాబుకు కూడా షాక్ కొట్టినట్లైంది. దాంతో విషయాన్ని చంద్రబాబు ఆరా తీశారు. వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏకి టిక్కెట్టు దక్కేది కూడా అనుమానమే అనే ప్రచారం కూడా జరుగుతోంది లేండి
టిటిడి ఉన్నతాధికారుల వైఖరికి నిరసనగానే ఎంఎల్ఏ చంద్రబాబు పర్యటనలో పాల్గొనలేదన్న విషయం బయటపడింది. టిటిడి ఉన్నతాధికారులకు ఎంఎల్ఏకి ఎప్పటి నుండో పడటం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ఎంఎల్ఏకి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా దక్కటం లేదు. ఇది ఒక విధంగా ఎంఎల్ఏకి అవమానమే. అదే సమయంలో ఎంఎల్ఏ కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మొన్న మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొనాలంటూ పెద్ద రచ్చే చేశారు. వందల కొద్ది టిక్కెట్లు, పదుల సంఖ్యలో ఆకామిడేషన్ కావాలంటే ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దాంతో ఉన్నతాధికారులకు, ఎంఎల్ఏకు మధ్య పెద్ద వివాదమే నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే సిఎం పర్యటనకు ఎంఎల్ఏ డుమ్మా కొట్టారు.