రాజకీయాల్లో కక్ష సాధింపులు కామన్. ప్రత్యర్థిని లొంగదీసుకునేందుకు ఇది ఉత్తమ సాధనంగా అధికార పక్షం భావిస్తూ ఉంటుంది కూడా. అయితే, ఒక్కొక్కసారి ఈ కక్ష సాధించే ప్రత్యర్థులకు వరంగా మారిపోతుంటాయి. తాజాగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అది కూడా నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. నిజానికి ఈ వారెంటు వెనుక కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ హస్తం ఉందనేది కొందరి మాట. లేకపోతే.. ఎప్పుడో 8 ఏళ్ల కిందట మూలన బడిన కేసును ఇప్పుడు తొవ్వి తీసి విచారించాల్సిన అవసరం ఏమిటి? అనేది ప్రధాన ప్రశ్న. అదికూడా తెలంగాణ కు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ కేసు ప్రస్థావన రావడం మరింత సంచలనంగా మారింది.
విషయంలోకి వెళ్తే.. మహారాష్ట్రలో గోదావరి పై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010 సంవత్సరంలో అప్పటి ప్రతి పక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో 40మంది ఎమ్మెల్యేలు బాబ్లీ సందర్శనకు బయలుదేరారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం, దానికి అనుబంధంగా అనేక ఎత్తిపోతల పధకాల నిర్మాణాలు చేపట్టడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి, ఉత్తర తెలంగాణా ఎడారిగా మారుతుందని తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. తెలంగాణా సరిహద్దులు దాటి ఈ బృందం మహారాష్ట్రంలోని ధర్మాబాద్కు చేరుకున్న వెంటనే అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అయినప్ప టికీ తాము బాబ్లీ ప్రాజెక్టును సందర్శించాల్సిందే
నని చంద్రబాబు పట్టుబట్టడం, ముందుకు చొచ్చుకు వెళ్లడంతో మహారాష్ట్ర పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.
చంద్రబాబు మినహా మిగతా ఎమ్మెల్యేలపై జరిగిన లాఠీ ఛార్జిలో అనేక మంది గాయపడ్డారు. అనంతరం చంద్రబాబుతో సహా అందర్నీ అదుపులోకి తీసుకుని ఓ ఐటీఐ కాలేజీలో నిర్భందించారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం కలిగిం చింది. చంద్రబాబు పై కేసులు నమోదు చేయడంతో బెయిల్ తీసుకోవాలని అక్కడి పోలీసులు కోరగా, బెయిల్ తీసుకు నేందుకు నిరాకరించారు. తర్వాత చంద్రబాబును విమానం ఎక్కించి హైదరాబాద్కు పంపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అదుపులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి వివిధ కారణలతో చంద్రబాబుపై కేసు నమోదయ్యాయి.
8 నెలల క్రితం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం కోర్టుకు హాజరుకాకపోవడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచీ ఈ వారెంట్ పెండింగ్లో ఉంది. ఇటీవల మహారాష్ట్ర వాసి ఒకరు ఈ నాన్ బెయిల్బుల్ వారెంట్ను ఎందుకు అమలు చేయడంలేదంటూ పిటీషన్ వేశారు. దీంతో తాజాగా కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, దీనికి మరో కోణం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. కూడా అది రాజకీయంగా బాబుకు లబ్ధి చేకూర్చనుంది., తెలంగాణ కోసం ఆయన ఈ కేసును భరిస్తానంటూ ఓ ప్రకటన చేస్తే.. చాలు.. రాజకీయంగా ఇది పూర్తిగా చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి కేసు పెట్టడం ద్వారా మోడీ.. బాబుకు మేలు చేశాడని చెబుతున్నారు.