ఎన్నికల వేడి రాజుకుంది. మరో ఏడెనిమిది మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నేతలు వారి వారి స్థాయిలో టికెట్ల సాధనకు విపరీతమైన కృషి చేస్తున్నారు. ఇప్పుడున్న పార్టీలో టికెట్లపై డౌటుంటే.. వెంటనే పార్టీ మారేందుకు, టికెట్ సంపాయించుకునేందుకు కూడా ఏ మాత్రమూ వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాన విపక్షం వైసీపీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కు చెందిన నాయకుడు చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి వైసీపీలో ఈయనకు గట్టి పట్టుంది. అంతేకాదు, పార్టీ అధినేత జగన్ దగ్గర కూడా మంచి పలుకుబడి ఉంది. ఈ క్రమంలోనే సునీల్కు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ గా అవకాశం కూడా ఇచ్చారు.
అయినా కూడా టీడీపీ నుంచి వస్తున్న ఆహ్వానం, కాకినాడ నుంచి వైసీపీ తరఫున టికెట్ వస్తుందో రాదో అనే ఆందోళన ఆయనను పార్టీ ఫిరాయించేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తర్వాత జిల్లాలో ఆ పార్టీ బలపడుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా పార్టీ నుంచి ముఖ్య నేతలు బయటకుపోతున్నారు. ఇప్పటికే అరడజను మందికిపైగా ప్రాధాన్యం ఉన్న నాయకులు ఆ పార్టీకి గుడ్బై చెప్పి జన సేనలో చేరారు. తాజాగా..ఇప్పుడు సునీల్ కూడా పార్టీ మారేందుకు, సైకిల్ ఎక్కేందుకురెడీ అవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. కాగా, సునీల్ బాటలో మరికొందరూ టీడీపీ వైపు దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
కాకినాడ పార్లమెంట్ టికెట్ సునీల్కి ఖాయమైనట్టు చెప్తున్నారు. అలా దృష్టిసారిస్తున్న నేతలకు టీడీపీ నుంచీ ఆహ్వానం అందుతున్నట్టు తెలుస్తోంది. ముందు నుంచీ వైసీపీలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు ఉన్న నాయకు డు ఆ పార్టీలో ఇమడలేక సతమతమవుతున్నారని టీడీపీ నేతలే చెబుతుండడం గమనార్మం.. మూడు నెలల కిందట సామాజిక వర్గీయులతో సమావేశమై భవిష్యత్ నిర్ణయంపై సమాలోచనలు చేసిన సమయంలోనే వైసీపీకి గుడ్బై చెప్తారని భావించారు. ఆ సమయంలో జగన్ వారించడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇపుడు వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో తనకు ప్రాధాన్యం తగ్గించి చులకన చేస్తున్నారని భావిస్తున్న సదరు నేత.. ఇక ఆ పార్టీలో ఇమడలేనని భావిస్తూ.. పార్టీ మారేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సమాచారం., మరి జగన్ నిలువరిస్తాడో.. లేక చూస్తూ ఊరుకుంటాడో చూడాలి.