ముందస్తు ఎన్నికల నేపధ్యంలో తెలంగాణాతో పాటు ఏపిలో కూడా ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందో తెలుసుకునేందుకు ప్రముఖ మీడియా సంస్దలు నిర్వహించిన ఓ సర్వేలో కెసిఆర్ , జగన్ ముందంజలో ఉన్నారు. ముందస్తు ఎన్నికల నేపధ్యంలో జనాల నాడిని తెలుసుకునేందుకు ఇండియా టుడే తో కలిసి ప్రముఖ టివి చానల్ ఆజ్ తక్ సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో మెజారిటీ జనాలు తెలంగాణాలో అయితే కెసిఆర్, ఏపిలో అయితే జగన్మోహన్ రెడ్డి జై కొట్టారు.
ముందస్తు ఎన్నికల నేపధ్యంలో తెలంగాణాలో కెసిఆర్ వైపే జనాల మొగ్గుంటుందని దాదాపు అందరూ అనుకుంటున్నదే. సర్వే ప్రకారం జనాల్లో 43 శాతం ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత స్దానాల్లో 18 శాతంతో కాంగ్రెస్ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, 15 శాతంతో బిజెపి నేత కెషన్ రెడ్డికి ఓట్లేశారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో ఏపిలో ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలని అనుకుంటున్నారంటే 43 శాతం మంది జగన్ కే ఓట్లేశారు. చంద్రబాబునాయుడు కు మద్దతుగా 38 శాతం మంది, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అనుకూలంగా 5 శాతం మంది మాత్రమే ఓట్లేశారు. అదే సమయంలో ప్రధానమంత్రిగా తెలంగాణాలో నరేంద్రమోడికి 44 శాతం మంది మద్దతు ఇవ్వగా రాహూల్ గాంధికి 39 శాతం మొగ్గు చూపారు. ఏపిలో ప్రధానమంత్రిగా రాహూల్ గాంధి వైపు 44 శాతం మొగ్గు చూపటం విశేషం. మోడికి 38 శాతం మంది మాత్రమే ఓట్లేశారు. అంటే ఈ సర్వే ప్రకారం ఏపిలో కాంగ్రెస్ పై వ్యతిరేకత తగ్గి బిజెపిపై పెరుగుతోందన్న విషయం అర్దమవుతోంది. మరి సర్వే ఫలితాల్లాగే రేపటి ఎన్నికల రిజల్టు కూడా ఉంటుందా లేదా అన్నదే చూడాలి.