దేశం మొత్తం మీద దండగమారి ఖర్చులు పెట్టేవాళ్ళల్లో చంద్రబాబునాయుడును మించిన వారు లేరని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది. తాజాగా మరో ఉదాహరణ వెలుగుచూసింది. ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి వ్యవహారం సుప్రింకోర్టులో ఉంది. ఆ కేసును వాదించటానికి ఏపి తరపున గట్టి లాయర్లను నియమించుకోవాలని చంద్రబాబు అనుకున్నారు. ఇంకేముంది ప్రముఖ న్యాయవాది ఫాలి నారిమన్ పేరు ఖరారైపోయింది. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సిఫారసు మేరకు నారిమన్ ను నియమించుకుంటున్నట్లు జీవో కూడా జారీ అయిపోయింది.
నారిమన్ ప్రముఖ న్యాయవాదే అనటంలో సందేహం లేదు. కానీ అంతటి ఖరీదైన న్యాయవాదిని నియమించుకోవటం అవసరమా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఏపి ప్రభుత్వం తరపున వాదించినందుకు నారిమన్ కు గంటకు ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు అక్షరాల రూ. 33 లక్షలు. కోర్టులో వాదనలు వినిపించే సమయం గంటదాటితే మళ్ళీ అదనపు ఫీజుంటుందట. ఇదేమిటో అర్ధం కావటం లేదు.
అసలు ఉమ్మడి హైకోర్టు విభజనలో వివాదమేంటో అర్ధం కావటంలేదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హైకోర్టు పదేళ్ళుండాలి. కానీ చంద్రబాబు చేతకానితనానికి తెలంగాణా ప్రభుత్వం ఒత్తిడి కూడా తోడవ్వటంతో వెంటనే విభజన చేయాల్సొస్తోంది. అసలు ఇంతకాలం హైకోర్టు విభజనను చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ హటాత్తుగా దృష్టి పెట్టారు. అయితే, విభజనలో ఆలస్యమైతే ఇపుడున్న హై కోర్టును ఏపికే వదిలేసి తాము వేరే కోర్టును ఏర్పాటు చేసుకుంటామని తెలంగాణా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇంతలో హైకోర్టు విభజనకు వ్యతిరేకంగా కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది.
ఇవన్నీ ఇలా వుండగానే అమరావతిలో హై కోర్టు ఏర్పాటుకు తాత్కాలిక భవనాల నిర్మాణం జరుగుతోంది. మరి ఇన్ని పరిణామాల మధ్య హైకోర్టు విభజనపై సుప్రింకోర్టులో ఏపి ప్రభుత్వం వాదనల అవసరం ఏంటి ? తెలంగాణా ప్రభుత్వం హైకోర్టును వెంటనే విడదీయమనింది. ఏపి ప్రభుత్వం కూడా అందుకు ఒప్పుకున్నది. కాకపోతే కాస్త సమయం అడుగుతోంది. ఆ సమస్యను కోర్టు వెలుపల పరిష్కరించుకోవచ్చు. లేదా తెలంగాణా ప్రభుత్వం చెప్పినట్లుగా ఇపుడున్న హైకోర్టు భవనాలను ఏపి తీసేసుకోవచ్చు. వీటిల్లో ఏది చేసినా రూ 33 లక్షల ఫీజు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు.
గంటకు నారిమన్ ఫీజే రూ. 33 లక్షల అంటే కేసు ఎప్పటికి తేలేను ? అంటే కేసు తేలేటప్పటికే లాయర్ కు ఎన్ని కోట్టు ఖర్చవుతుందో ? చూడబోతే నారిమన్ కు ఇచ్చుకునే ఫీజుతోనే ఓ తాత్కాలిక భవనం కట్టుకోవచ్చేమో ? చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటానికి మాత్రమే ఉపయోగపడుతోంది. ఎక్కడ చూసినా కోట్ల రూపాయల ప్రజాధనం వృధానే కనిపిస్తోంది. పైగా తెలంగాణాలో ఇపుడున్నది ఆపద్ధర్మ ప్రభుత్వమన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.