ఈ మద్య తెలంగాణలో రాజకీయాలు బాగా వాడీ వేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఎవరి ప్లాన్ లో వారు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ ప్రచారం ప్రారంభించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాట్లలో ఉంది. ఇదిలా ఉంటే..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేటి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ చేరుకున్న విషయం తెలిసిందే.
ఉదయం 11:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 12 గంటలకు బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లాల్దర్వాజ సింహవాహిణి మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. వీలైతే అక్కడ కొద్దిసేపు మాట్లాడి, ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. మజ్లిస్కు కంచుకోట వంటి ఓల్డ్ సిటీలో దైవ దర్శనం చేసుకుని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం ద్వారా రాజకీయ వేడిని పుట్టించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
తర్వాత రోడ్ మార్గంలో అమిత్ షా మహబూబ్నగర్కు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మహబూబ్నగర్లో ప్రారంభమయ్యే బీజేపీ ఎన్నికల శంఖారావ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, పదాధికారులతో సాయంత్రం 6:30 గంటలకు శంషాబాద్ సమీపంలోని కొత్తూరులో భేటీ కానున్నారు. వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహం గురించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రాయం నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. జిల్లా ఇన్చార్జ్లు, జిల్లా అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించనున్నారు.