ధర్మబాద్ న్యాయస్ధానం జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అమెరికా పర్యటనకు అడ్డం పడుతుందనే ఆందోళన చంద్రబాబునాయుడులో మొదలైంది. మహారాష్ట్రలోని బాబ్లి ప్రాజెక్టు సైట్ లోకి అనుమతి లేకుండా ఎంటరైన కారణంగా చంద్రబాబు అండ్ కోను అరెస్టు చేసి తర్వాత వదిలిపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఆ కేసు ధర్మాబాద్ జిల్లా కోర్టుకెక్కింది.
గడచిన 8 ఏళ్ళుగా అసలు కేసు గురించిన ఊసే లేనప్పటికీ తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో హటాత్తుగా కోర్టు చంద్రబాబుకు అరెస్టు వారెంట్ జారీ చేయటంపై అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నేతల ద్వారా చంద్రబాబే తనకు నోటీసులు వచ్చేట్లు చేసుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయనుకోండి అది వేరే సంగతి. నిజానికి చంద్రబాబుపై పెట్టిన కేసు పనికిమాలింది. అటువంటి కేసును చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకుని విపరీతంగా ప్రచారం తెచ్చుకుంటున్నారు. టిడిపి నేతలు ఓవర్ యాక్షన్ కూడా ఇందులో భాగమే.
ఇటువంటి నేపధ్యంలోనే చంద్రబాబు న్యాయ నిపుణులతో కేసు విషయమై చర్చించినట్లు టిడిపికి మద్దతిచ్చే మీడియా ప్రచారం చేస్తోంది. అరెస్టు వారెంటు నోటీసులపై న్యాయ నిపుణుల సలహా కోరారట. ఎందుకంటే, ఈనెల 23వ తేదీన చంద్రబాబు అమెరికా వెళుతున్నారు. ఈనెల 21వ తేదీన కోర్టులో హాజరవ్వాలి. కేసు విచారణ సందర్భంగా ఎటువంటి పరిస్ధితులు తలెత్తుతాయో అన్న ఆందోళణ చంద్రబాబులో మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇంత చిన్న కేసును చంద్రబాబు తన ప్రచారానికి వీలుగా ఎంత భీబత్సంగా వాడుకుంటున్నారో ?