రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అని చెప్పడానికి తాజాగా తెలంగాణాలో పొడిచిన కాంగ్రెస్-టీడీపీ పొత్తు ప్రధాన ఉదాహరణగా నిలుస్తోందని అంటు న్నారు పరిశీలకులు. మరో రెండు మాసాల్లోనే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న తెలంగాణాలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకునేందుకు ప్రస్తుత అధికార పార్టీ టీఆర్ ఎస్ ఎంతగా ప్రయత్నిస్తోందో.. అదేసమయంలో తెలంగాణ ఇచ్చింది మేమే! అని చాటుతున్న కాంగ్రెస్ మరింతగా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల మధ్య టఫ్ ఫైట్ సాగనుందనే వ్యాఖ్యలు జోరందుకున్నాయి. బీజేపీ ఉన్నప్పటికీ దీని ప్రభావం పెద్దగా కనిపించే చాన్స్ లేదని అంటున్నారు. దీంతో ప్రధాన పోటీ కాంగ్రెస్-టీఆర్ ఎస్ల మధ్య ఉంటుందని చాటుతున్నారు.
అయితే, కాంగ్రెస్ స్వయంగా టీఆర్ ఎస్ను ఢీకొట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉండడంతో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తన అస్తిత్వాన్నినిలుపుకొనేందుకు పాకులాడుతున్న టీడీపీని చెంతకు చేర్చుకుని తెలంగాణలోను, అదేసమయంలో కేంద్రంలోనూ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే విధిలేని పరిస్థితిలో టీడీపీతో పొత్తుకు రెడీ అయింది. అయితే, టీడీపీ బద్ధ శత్రువుగా కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బద్ధ శత్రువుగా టీడీపీ వ్యవహరించిన ఈ రాష్ట్రంలో అందునా కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పాటైన టీడీపీ.. ఇప్పుడు పొత్తుకు రెడీ కావడం ఎంత మేరకు సమంజసమనే మాట వినిపిస్తోంది. వాస్తవానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. కానీ, ఈ సూత్రం ఏ ఇతర పార్టీలకైనా వర్తిస్తుందేమో కానీ, టీడీపీ-కాంగ్రెస్ కు మాత్రం ఈ ఫార్ములా వర్తించదనేది రాజకీయ విశ్లేషకుల మాట.
నిజానికి చంద్రబాబు రాజకీయ జీవితాన్ని ఒక్కసారి తరచి చూస్తే.. ముఖ్యంగా ఆయన టీడీపీ పగ్గాలు చేపట్టాక ఆయన ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన సందర్భం లేనేలేదు. కుదిరితే వామపక్షాలు లేదా బీజేపీతో ఆయన అంటకాగుతూనే ఉన్నారు. అయితే,ఇప్పుడు మాత్రం రాజకీయాలు తీవ్రంగా మారిన క్రమంలో ప్రధాన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మరీ కాంగ్రెస్తో పొత్తుకురెడీకావడమే అసలు సిసలు రాజకీయం! ఇక, ఈ రెండు పార్టీల పొత్తు ఎంత వరకు కొనసాగుతుంది? అనేది కూడా ఇప్పుడు తెరమీదికి వస్తున్న ప్రశ్న. ఎన్నికల్లో విజయం వరకే ఇది పరిమితమవు తుందా? ఒకవేళ రేపు తెలంగాణాలో పరిస్థితులు మారిపోయి.. కేసీఆర్ ఓడి కాంగ్రెస్ గెలిస్తే.. ప్రభుత్వంలోనూ భాగస్వామ్యం అవుతుందా? అంటే ఔననే సంకేతాలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి వీరి పొత్తు ఎన్నికలకే పరిమితం కాదని తెలుస్తోంది. ఏదేమైనా.. బద్ధ శత్రువులు ఆప్తమిత్రులుగా మారినా.. వీరి బంధం అంత ద్రుఢం కాదనేది వాస్తవం! మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.