తెలంగాణ లో బీజేపీ తెరాస ఒక్కటయిందన్న సంగతీ ఓపెన్ సీక్రెట్. కెసిఆర్ పైకి అలా మాట్లాడుతున్న తెర వెనుక ఒక అవగాహన కుదిరిందన్న సంగతీ తెలుస్తుంది. గతంలో ఓ సారి తెలంగాణలో అమిత్ షా పర్యటించినప్పుడు, ఆయన కేసీఆర్ మీద విమర్శలు చేస్తే.. కేసీఆర్ ఊరుకోలేదు, ఇంకా స్ట్రాంగ్గా కౌంటర్ ఎటాక్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు కొన్నాళ్ళు హడావిడి చేసి, ఆ తర్వాత సైలెంటయిపోయారు.
కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థుల్ని పెట్టబోతోందనీ, అవన్నీ బీజేపీ ఖాతాలో పడ్తాయనీ ఓ వాదన బలంగా విన్పిస్తోంది. ఈ వాదనని అంత లైట్ తీసుకోవడానికి వీల్లేదు. మొన్నామధ్యనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, ఢిల్లీకి వెళ్ళినా.. అక్కడ కీలక చర్చలు 'ముందస్తు ఎన్నికల' మీదనే జరిగాయి. ఎన్నికల కమిషన్ ప్రకటించాల్సిన ఎన్నికల షెడ్యూల్ని కేసీఆర్ చూచాయిగా ప్రకటించేయడం ఎలా సాధ్యమైందట.? కేంద్ర ప్రభుత్వం తాలూకు సహాయ సహకారాలు లేకుండానే కేసీఆర్, ఇదంతా చేసేస్తున్నారని అనుకోలేం.
'అప్పుడేమో జమిలి ఎన్నికలకు జై కొట్టారు.. ఇప్పుడేమో ముందస్తు ఎన్నికలంటున్నారు.. ఇదెక్కడి న్యాయం.?' అంటూ కేసీఆర్ని, అమిత్ షా అమాయకంగా ప్రశ్నించారు. అమిత్ షా అంత అమాయకుడా.? ఛాన్సే లేదు. కానీ, అమాయకత్వం నటిస్తున్నారు.. కేసీఆర్ని విమర్శిస్తున్నట్లు హడావిడి చేస్తున్నారు. పలు అంశాలపై కేసీఆర్ని మీడియా సాక్షిగా నిలదీసేందుకు ప్రయత్నించారు. ఇదంతా టీఆర్ఎస్ - బీజేపీ ఉమ్మడి ఎజెండా ప్రకారం నడుస్తున్న వ్యవహారమేనని జనానికి అర్థం కాకుండా వుంటుందా.?